Explosive News | భారత్‌పై ఉగ్ర దాడుల వెనుక పాక్​ ఐఎస్​ఐ రహస్య విభాగం – S1

ISIలోని రహస్య విభాగం “S1” లేదా “Subversion-1” 25 ఏళ్లుగా భారత్‌పై ఉగ్ర దాడుల ప్రణాళికలను రచిస్తున్నదని భద్రతా వర్గాలు వెల్లడించాయి.  భారత్​లో జరిగిన అన్ని దాడులకు ఎస్​1నే కారణమని నిఘావర్గాలు ధృవీకరించాయి. డ్రగ్ మనీతో నిధులు సమకూర్చి వేలాదిమంది మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.

Explosive News | భారత్‌పై ఉగ్ర దాడుల వెనుక పాక్​ ఐఎస్​ఐ రహస్య విభాగం – S1

Pakistan’s Secret ISI Unit ‘S1’ Behind Terror Attacks on India

  • 25 ఏళ్లుగా ISI లో పనిచేస్తున్న ‘Subversion-1 (S1)’
  • కేవలం భారత్​పై ఉగ్రదాడులే దాని ఏకైక కార్యక్రమం
  • అన్ని ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలు, ఆదేశాలు
  • రాజకీయ నాయకత్వానికి తెలియని ఎస్​1

( విధాత నేషనల్​ డెస్క్​)

న్యూఢిల్లీ:
Explosive News | పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ISI) లోని అత్యంత రహస్య విభాగం “S1” లేదా “Subversion-1” గత మూడు దశాబ్దాలుగా భారత్‌పై ఉగ్రదాడులను సమన్వయం చేస్తోందని భారత భద్రతా వర్గాలు కనుగొన్నాయి. 1993 ముంబై పేలుళ్ల నుండి ఇటీవల జమ్మూ–కాశ్మీర్‌లోని పహల్గామ్​లో పర్యాటకులపై జరిగిన దాడిదాకా, ఈ యూనిట్‌ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాత్ర పోషించినట్లు ఇంటెలిజెన్స్‌ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మధ్యనే భారత నిఘా వర్గాలు దీని వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో గుర్తించాయి.

భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ యూనిట్‌ పాకిస్తాన్‌ సైన్యంలో ఒక కల్నల్‌ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేస్తోంది. అతనికి “గాజీ 1” మరియు “గాజీ 2” అనే మారుపేర్లతో ఉన్న ఇద్దరు ఉన్నతాధికారులు సాయపడుతున్నారు. ఈ యూనిట్‌ కార్యాలయం కూడా ఇస్లామాబాద్‌లోని ISI ప్రధాన భవనం లోనే ఉందని వెల్లడించారు.

ఉగ్ర శిక్షణ, నిధుల మూలం – పాకిస్తాన్‌లోని డ్రగ్ నెట్‌వర్క్

“S1” యూనిట్‌ కార్యకలాపాలకు అవసరమైన నిధులు ప్రధానంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా (Drug Money) ద్వారా సమకూరుతున్నాయి. ఈ నిధులతో ఉగ్ర శిక్షణ శిబిరాలు, ఆయుధాల కొనుగోలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు నిర్వహిస్తున్నారని వర్గాలు పేర్కొన్నాయి.

ఈ యూనిట్‌లోని సభ్యులు బాంబులు, ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోసివ్‌ డివైసెస్‌ (IEDs) తయారీలో నిపుణులు. వీరు జైష్‌-ఏ-మహమ్మద్‌, లష్కరే-తొయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి ఉగ్ర సంస్థలకు అనుబంధంగా ఉంటారు. ఎస్​1 నాయకత్వం నుండి వచ్చిన ఆదేశాలను ఉగ్రసంస్థలకు అందజేసి, అమలు చేసేలా చూడటం వీరి బాధ్యత. స్థానిక దుస్తులు ధరించి, పొడవైన గడ్డం పెంచి, సాధారణ మిలిటెంట్ల్లలో కలిసిపోతారని సమాచారం.

ఈ యూనిట్‌ అంత రహస్యంగా ఉంటుంది కాబట్టి, అనేక ఉగ్ర సంస్థలకే తమ శిక్షకులు వాస్తవానికి ISIకు చెందినవారని తెలియదు. గత రెండు దశాబ్దాల్లో వేలాదిమంది ఉగ్రవాదులను శిక్షణ ఇచ్చినట్లు నివేదికల్లో వెల్లడించబడింది. వాస్తవానికి ఈ విషయం పాకిస్తాన్​ రాజకీయ నాయకత్వానికి కూడా తెలియకపోవడం గమనార్హం.

భారత భద్రతా వర్గాల నివేదికల ప్రకారం, “S1” యూనిట్‌ వద్ద భారత ప్రధాన నగరాలు, వ్యూహాత్మక ప్రాంతాలు, సైనిక స్థావరాల మ్యాపులు ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాలు, ఆన్‌లైన్ డేటా హ్యాకింగ్‌ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించారని చెబుతున్నారు. భారత ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఎస్​1ను ఇప్పుడు చాలా నిశితంగా గమనిస్తున్నాయి.

ఈ యూనిట్‌ ISI నేరుగా పర్యవేక్షించే “సీక్రెట్​ ఆపరేషన్ డివిజన్”లో భాగంగా పనిచేస్తోంది. ఇస్లామాబాద్‌లోని E-సెక్టార్‌ ప్రాంతంలో గల భవనంలో దీని ప్రధాన కేంద్రం ఉన్నట్లు అంచనా.

తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం : రంగంలోకి భారత నిఘా సంస్థలు

భారత భద్రతా వర్గాలు RAW, NIA, IB వంటి సంస్థల ద్వారా ఇప్పటికే “S1” యూనిట్‌ నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. భారత గూఢచార సంస్థల ప్రకారం, ఈ యూనిట్‌ కేవలం దాడులు చేయడం మాత్రమే కాదు — భారత అంతర్గత శాంతి, పర్యాటకం, ఆర్థిక వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కూడా దీని ప్రధాన లక్ష్యం.

Inside ‘Subversion-1’: 25-Year-Old Covert Wing Funding Terror Through Drug Money and Training Militants

ఈ విభాగం 25 ఏళ్లుగా నిరంతరంగా పనిచేస్తోందని, మాదకద్రవ్య వ్యాపారం, హవాలా మార్గాలు, ఉగ్ర సంస్థలు కలిసి దీన్ని నడుపుతున్నాయని గూఢచార నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, పాతికేళ్లుగా నడుస్తున్నా, ఇంతకాలం వరకు దీని ఉనికి ఏ నిఘాసంస్థలకు అందకపోవడం విశేషం. కారణం, పాక్​ పరిపాలన, మిలిటరీ, ఐఎస్​ఐలో ఉన్న అత్యున్నత స్థాయి అధికారులకు కూడా దీని గురించి తెలియకపోవడమే. 2024 చివర్లో ఐఎస్​ఐ ఛీఫ్​గా నియమించబడ్డ లెఫ్టినెంట్​ జనరల్​ మహమ్మద్​ ఆసిమ్​ మాలిక్​ నేరుగా ఎస్​1 కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. గాజీ1,2లు ఇద్దరూ ఇతనినే రిపోర్టు చేస్తుండగా, మాలిక్​ దేశ సర్వసైన్యాధ్యక్షుడు ఆసిమ్​ మునీర్​కు మాత్రమే జవాబుదారీగా వ్యవహరిస్తున్నాడు. ఇతను జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నాడు.

ఈ “S1” యూనిట్‌ ఉనికి భారత భద్రతా వ్యవస్థకు కఠినమైన సవాలు. దీని ద్వారా పాకిస్తాన్‌ భారత్‌పై “అక్రమ యుద్ధం (Asymmetric Warfare)” కొనసాగిస్తున్నదని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత గూఢచార సంస్థలు ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేయడంపై దృష్టి సారించాయి. దేశ రక్షణ వ్యవస్థలు ఇలాంటి నిగూఢ యూనిట్లను సమూలంగా నిర్మూలించేందుకు అంతర్జాతీయ మద్దతును కూడా కోరుతున్నాయి.