• Telugu News
  • /National

ఆత్మహత్య యత్నం చేసిన కొడుకుతో సహా తల్లిదండ్రుల దుర్మరణం

సెల్ ఫోన్ కొనివ్వడం లేదంటూ ఆత్మహత్య చేసుకోబోతున్న కొడుకును రక్షించబోయి..అతనితో పాటు తల్లిదండ్రులు కూడా కొండపై నుంచి పడి మరణించిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకుంది

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 22, 2026, 12:39 pm IST
Read Time: 4 mins
ఆత్మహత్య యత్నం చేసిన కొడుకుతో సహా తల్లిదండ్రుల దుర్మరణం

సెల్ ఫోన్ కొనివ్వడం లేదని ఆత్మహత్య చేసుకోబోతున్న కొడుకును రక్షించబోయి..అతనితో పాటు తల్లిదండ్రులు కూడా కొండపై నుంచి పడి మరణించిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన 19ఏళ్ల యువకుడు కునాల్ చంద్‌గుడే మొబైల్ ఫోన్ విషయంలో శుక్రవారం తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అనంతరం ఆత్మహత్య చేసుకుంటానని వారిని బెదిరించి, ఉదయం 10గంటల సమయంలో ఖవ్డా కొండ వద్దకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు మురళీధర్ (48), సంగీత కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అతడికి నచ్చజెప్పడానికి వారు దాదాపు 3గంటల పాటు ప్రయత్నం చేశారు.

తన దగ్గరకు వస్తే దూకేస్తానని వారిని బెదిరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిందకు రావాలని యువకుడికి ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అతడిని కాపాడడానికి కొండ కింద వల ఏర్పాటు చేశారు. చంద్‌గుడే కిందకు దూకితే పట్టుకునేందుకు వల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే కొండపై ఉన్న చంద్‌గుడే పదేపదే తన స్థానాన్ని మారుస్తూ వచ్చాడు. ఫలితంగా, అగ్నిమాపక బృందం అతడి కదలికలకు అనుగుణంగా వల స్థానాన్ని పదేపదే మార్చింది. కానీ ఆ ప్రయత్నాలు చివరికి విఫలమయ్యాయి.

వేరేదారి లేక అతడి తండ్రి కూడా కొండపైకి ఎక్కి.. యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పట్టుతప్పడంతో ఇద్దరూ కొండ అంచు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన ఆ యువకుడి తల్లి కూడా కొండపై నుంచి దూకేసి మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించినట్లు చెప్పారు.