హర్భజన్ కు పోలీసు సెక్యురిటీ తొలగింపు …మరునాడే సీఐఎస్ఎఫ్ కేటాయింపు

ఆప్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్, భజ్జి హర్భజన్ సింగ్ పార్టీ మారుతున్నట్లు సమాచారం రాగానే పంజాబ్ రాష్ట్ర ఆప్ ప్రభుత్వం వెంటనే భద్రతగా ఉన్న పోలీసులను ఉపసంహరించుకున్నది.

విధాత, హైదరాబాద్ : నిన్నటి వరకు ఆప్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్, భజ్జి హర్భజన్ సింగ్ కు పంజాబ్ ప్రభుత్వం ఆయనకు పది మంది పోలీసులను భద్రత కోసం కేటాయించింది. ఆయన పార్టీ మారుతున్నట్లు సమాచారం రాగానే పంజాబ్ రాష్ట్ర ఆప్ ప్రభుత్వం వెంటనే భద్రతగా ఉన్న పోలీసులను ఉపసంహరించుకున్నది. పార్టీ వీడవద్దంటూ ఆయన ఇంటి ముందు కార్యకర్తలు ఆందోళనకు దిగడం, పరిస్థితులు చేజారి పోతుండడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరునాడే సీఐఎస్ఎఫ్ బలగాలను భద్రతగా నియమించింది. ఇప్పుడు ఆయన ఇంటి ముందు కేంద్ర పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి.
భజ్జి హర్భజన్ సింగ్ ఆప్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన తో పాటు మరో ఆరుగురు ఆప్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాజ్యసభలో ఆప్ బలం మూడుకు పడిపోయింది. ఏడుగురు రాజ్యసభ సభ్యుల అంగీకారం మేరకు అందరినీ బీజేపీ సభ్యులుగా గుర్తిస్తూ రాజ్యసభ సభ ఛైర్ పర్సన్, ఉప రాష్ట్రపతి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై కన్నెర్ర చేసిన ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. హర్భజన్ సింగ్ కు రాష్ట్ర పోలీసు భద్రతను తొలగించాల్సిందిగా పంజాబ్ సీఎం విక్రమ్ సింగ్ మాన్ కు ఆదేశాలు జారీ చేయడం, ఆయన అమలు చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆదివారం నాడు జలంధర్ లోని ఛొట్టి బారదారి ప్రాంతంలో హర్భజన్ సింగ్ నివాసముంటున్నారు. ఆప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆదివారం వరకు ఆయన ఇంటి ముందు పంజాబ్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించారు. ఆయన పార్టీ మారడం, రాజ్యసభలో ఆప్ బలం ఖాళీ కావడంతో అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహానికి లోనయ్యారు. పంజాబ్ పోలీసులు భద్రత విధులు ఉపసంహరించుకోవడంతో, ఆయన ఇంటి ముందు ఆప్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ, తీవ్రంగా దూషించారు. ఆయన మూడంతస్తుల భవనం గోడలపై రంగులతో స్ప్రే చేశారు. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ కేంద్రంలోని పెద్దలకు తెలియచేయడంతో వెంటనే సీఐఎస్ఎఫ్ బలగాలను పంపించారు. వచ్చీ రాగానే ఆప్ ఆందోళనకారులను చెదరగొట్టి, ఆయన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు.
మరో రాజ్యసభ సభ్యుడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ యజమాని అశోక్ మిట్టల్ యూనివర్సిటీ గేట్ తో పాటు కాంపౌండ్ వాల్ కు, లుధియానా కిచ్లునగర్ లోని రాజిందర్ గుప్తా ఇంటికి, ఛండీగఢ్ లోని సెక్టార్ 9 లోని ఆయన నివాసం ముందు కూడాకూడా రంగులు వేశారు. బీజేపీ లోకి మారిన ఆప్ రాజ్యసభ సభ్యులకు కార్యకర్తల దాడుల నుంచి రక్షణ కల్పించడంలో పంజాబ్ పోలీసు విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోవడంతో పది మంది లో ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని అన్నారు. రాజ్యసభ లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా రాఘవ్ చద్ధాను తొలగించిన తరువాత ఏప్రిల్ 15 వ తేదీ నుంచి ఆయనకు కొనసాగిస్తున్న భద్రతను ప్రభుత్వం తొలిగించిందన్నారు. ఆయన స్థానంలో వచ్చిన మరో ఎంపీ అశోక్ మిట్టల్ కూ రోజులు తిరక్కుండానే బీజేపీ లోకి మారడం విశేషం. గతంలో ఆఫ్ ఎంపీ సుశీల్ కుమార్ రింకు, ఆప్ మాజీ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్, మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ తో పాటు కుటుంబ సభ్యులకు, మాజీ ఎంపీ ప్రణీత్ కౌర్ లకు సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించారు.

Latest News