జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త: రాహుల్ గాంధీ హెచ్చరిక

సీబీఎస్‌ఈ ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ మూల్యాంకన లోపాలపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. తప్పులకు విద్యార్థులే మూల్యం చెల్లిస్తున్నారని జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

సీబీఎస్‌ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ (OSM) మూల్యాంకన ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్రం, సీబీఎస్‌ఈని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులతో ముచ్చటించిన వీడియోను సోమవారం ఎక్స్ వేదికగా షేర్ చేసిన రాహుల్ గాంధీ…మూల్యాంకన ప్రక్రియలో చేసిన తప్పుల నుంచి సీబీఎస్‌ఈ లాభపడుతోందని ఆరోపించారు.

జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు సీబీఎస్‌ఈ కార్యాలయంలో తిష్ట వేశారు. సీబీఎస్‌ఈ పొరపాటు వల్ల మార్కులు తప్పుగా వస్తే.. దానికి మీకు బిల్లు పడుతుందని హెచ్చరించారు. డిజిటల్ స్కాన్ కాపీ తీసుకోవాలంటే ఒక సబ్జెక్ట్‌కు రూ.100, ఒక పేపర్‌ రీటోటలింగ్‌కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్‌ చేయించుకోవాలంటే ఒక ప్రశ్నకు రూ.25, మొత్తంగా ఒక విద్యార్థి తన జవాబుపత్రాన్ని సరిగా దిద్దించుకోవడానికి దాదాపు రూ.2000 చెల్లించాల్సి రావొచ్చు అని రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. 4 లక్షల మంది విద్యార్థులు పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్నప్పుడు..సీబీఎస్ఈకి ఎంత ఆదాయం వస్తుందో గమనించాలని గుర్తు చేశారు.

శిక్ష విద్యార్థులకు..ఆదాయం ప్రభుత్వానికి

వాస్తవానికి 300 డీపీఐతో ఆటోమేటిక్‌ రోబోటిక్‌ స్కానర్లను పరీక్ష పత్రాల స్కానింగ్‌కు వినియోగించాల్సి ఉండగా.. ఆన్సర్‌ షీట్లను మొబైల్‌ ఫోన్‌ సాయంతో స్కాన్‌ చేసి తప్పిదాలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫోన్‌తో స్కాన్ చేస్తే.. తప్పులు రావడం ఖాయం. వాటిని సరిచేయడానికి అయ్యే ఖర్చు విద్యార్థులే చెల్లించాలని, తప్పు సీబీఎస్‌ఈది అయితే.. శిక్ష పడుతున్నది విద్యార్థులకు.. ఆదాయమేమో ప్రభుత్వానికి అని ఘాటుగా రాహుల్ గాంధీ విమర్శించారు. విద్య ఒక వ్యాపారంగా మారితే.. తప్పులు సరికాకపోగా రెట్టింపు అవుతాయి అని, సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు రూపంలో విద్యార్థులు మూల్యం చెల్లించుకుంటున్నారు అని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. సీబీఎస్‌ఈ టెండర్‌ నిబంధనలను మార్చేసిన ఫలితమే ఇదంతా అని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఘటన మరవకముందే… కొద్ది రోజులుగా సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల వివాదం దేశవ్యాప్తంగా రాజుకుంటుందని, పరీక్షల నిర్వహణలో యంత్రాంగం వైఫల్యం.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవరపరుస్తోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Latest News