RBI | దేశంలో భారీగా పెరుగుతున్న బ్యాంకింగ్ మోసాలు..! ఆర్బీఐ నివేదికలో కీలక విషయాలు..!
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో మోసాలు పెరిగిపోతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 36,075 మోసాలు నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9,046, 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,564 మోసాలతో పోలిస్తే 300శాతం పెరిగాయి

RBI | దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో మోసాలు పెరిగిపోతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 36,075 మోసాలు నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9,046, 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,564 మోసాలతో పోలిస్తే 300శాతం పెరిగాయి. అయితే, అయితే, ఈ మోసాల్లో పోగొట్టుకున్న సొమ్ము మాత్రం తగ్గుముఖం పట్టింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే క్రితం ఏడాది రూ.26,127 కోట్ల నుంచి రూ.13,930 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ గురువారం వార్షిక నివేదిక విడుదల చేసింది.
ఆర్బీఐ వార్షిక నివేదికలో ఆసక్తికర అంశాలను పేర్కొంది. మరో వైపు గత మూడేళ్లలో అత్యధిక మోసాలు ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనే జరిగాయి. అత్యధికంగా సొమ్మును నష్టపోయింది మాత్రం ప్రభుత్వ బ్యాంకుల్లో జరిగిన మాసాల్లోనేనని ఆర్బీఐ నివేదిక చెప్పింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో ఎక్కువగా ఫ్రాడ్స్ జరిగాయని.. లోన్ పోర్ట్ ఫోలియో అంశంలో ఎక్కువ సొత్తు మోసగాళ్ల పాలైందని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన మోసాలకు సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని సైతం ఆర్బీఐ నివేదికలో బయటపెట్టింది. మోసం జరిగిన తేదీకి, మోసపోయిన విషయం గుర్తించేందుకు చాలా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22లో 3,596 కార్డుల, ఇంటర్నెట్ మోసాలు నమోదమోయ్యాయి. ఆ సంఖ్య 2023-24లో 29,082కు పెరిగినట్లు నివేదిక చెప్పింది. ఇందులో కొద్దిపాటి నగదు మొత్తాలు అధిక సంఖ్యలో ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ తరహా మోసాలతో కోల్పోయిన మొత్తం గడిచిన రెండు సంవత్సరాల్లో రూ.155 కోట్ల నుంచి రూ.1,457 కోట్లకు పెరిగిందని వివరించింది.