దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశరాజధానిలో ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు కన్నులపండువగా సాగాయి
విధాత: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశరాజధానిలో ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డే పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు కన్నులపండువగా సాగాయి. వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోదీ ఎన్క్లోజర్ వద్దకు రాగానే ఆయన గ్యాలరీల్లో కూర్చున్న ప్రజలు నిలబడి స్వాగతం పలికారు. భారత్మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సారి మహిళా కేంద్రంగా ప్రదర్శనలు కొనసాగాయి. వివిధ సెక్టార్లకు చెందిన మహిళలు అనేక బృందాలకు సారధ్యం వహించారు. ‘అనంత్ సూత్ర’ పేరిట చేసిన చీరల ప్రదర్శన ఆకట్టుకున్నది.
తొలిసారి ఈ పరేడ్లో 100 మంది మహిళలు భారత భారతీయ సంగీతాన్ని వినిపించారు. ఇందులో సంప్రదాయ బ్యాండుకు బదులుగా శంఖం, నాదస్వరం, నగారా వంటి వాయిద్యాలు ఇచ్చిన సంగీత ప్రదర్శన అలరించింది. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు.
వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నది. అనేక శకటాలకు మహిళలే సారధ్యం వహించారు. త్రివిధ దళాల ప్రద్శనలు అలరించాయి. వాయుసేన ప్రదర్శనలు ప్రజలను మునివేళ్లపై నిలిపాయి. మూడు ఎస్యూ-30 ఎంకే -1 యుద్ద విమానాలు త్రిశూల విన్యాసాలను ప్రదర్శించాయి. కర్తవ్యపథ్ మీదుగా ఆరు రాఫెల్ యుద్ధ విమానాలతో మారుత్ విన్యాసం కనువిందు చేసింది. పరేడ్లో నారీశక్తి తెలిసేలా కొన్ని ప్రదర్శనలు జరిగాయి. 265 మంది మహిళలు మోటర్ సైకిళ్లపై వివిధ రకాలుగా నిర్వహించిన ప్రదర్శన ధైర్యా సాహసాలకు ప్రతీకగా నిలిచాయి. ఆయుధ సంపత్తి ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నది.