వయనాడ్‌లో రెస్క్యూ బృందాల సాహసం.. ట్రెక్కింగ్‌తో ఆరుగురు సభ్యుల గిరిజన కుటుంబాన్ని కాపాడిన బృందం

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం..వరదల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొండ చరియలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి.

వయనాడ్‌లో రెస్క్యూ బృందాల సాహసం.. ట్రెక్కింగ్‌తో ఆరుగురు సభ్యుల గిరిజన కుటుంబాన్ని కాపాడిన బృందం

విధాత, హైదరాబాద్ : కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం..వరదల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొండ చరియలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు నేటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె. హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు తెలిపిన వివరాల మేరకు… ఇంకా అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో ఆటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి చేరుకున్నారు. అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించారు. కాగా వారు కొద్దిరోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు తమతో రావాల్సిందిగా వారిని కోరగా ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బతిమాలగా వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు. పిల్లలను తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీ-పోచింగ్ కార్యాలయానికి తరలించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారన్నారు. రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సహాయక బృందాన్ని కొనియాడుతూ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం” అని ఎక్స్‌లో పోస్టు చేశారు. వర్షాలు తీవ్రరూపం దాల్చడంతో అటవీశాఖ వాయనాడ్‌లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన తెగలకు చెందిన చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు