న్యూఢిల్లీ : దేశ వర్షాకాల సీజన్ ప్రారంభాన్ని సూచిస్తూ నైరుతి రుతుపవనం మే 30, 2024న కేరళ తీరాన్ని తాకింది. అదే రోజు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాస్తవానికి జూన్ 1న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ రెండు రోజులు ముందుగానే ప్రవేశించడం విశేషం. గత ఏడాది జూన్ 8న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రుతుపవన సీజన్ (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో మధ్య భారతదేశం, దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, వాయవ్య భారతదేశంలో సాధారణ వర్షపాతం, సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే.. జూన్ 5, 12 తేదీల మధ్య రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.