• Telugu News
  • /National

SC On Stray Dogs| సుప్రీంకోర్టులో ఢిల్లీ వీధి కుక్కల కేసు తీర్పు రిజర్వ్

సుప్రీంకోర్టు ఢిల్లీ వీధి కుక్కల తరలింపు ఆదేశాలపై తీర్పు రిజర్వ్. డాగ్ లవర్స్, బాధితుల వాదనలు విన్న ధర్మాసనం.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 14, 2025, 3:01 pm IST
Read Time: 6 mins
SC On Stray Dogs| సుప్రీంకోర్టులో ఢిల్లీ వీధి కుక్కల కేసు తీర్పు రిజర్వ్

SC On Stray Dogs| న్యూఢిల్లీ : ఢిల్లీలో వీధి కుక్కలను తొలగించాలనే ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని ఆగస్టు 11న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇటీవలి తీర్పుపై స్టే విధించాలన్న వాదనపై తీర్పును రిజర్వు చేసింది. తీర్పును విమర్శించే డాగ్ లవర్స్ అఫిడవిట్ ఫైల్ చేయాలన్న సుప్రీంకోర్టు సూచించింది.

ఢిల్లీ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్థానిక అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. శునకాల బెడదకు వారే కారణమని పేర్కొంది. పార్లమెంటు నిబంధనలు, చట్టాలు రూపొందిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని అసంతృప్తి వెలిబుచ్చింది. స్థానిక అధికారుల బాధ్యతారాహిత్యమే ఈ సమస్యకు కారణం అని.. జంతు సంతతి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో వీధి కుక్కుల బెడద అధికమైందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇటీవలి తీర్పుపై స్టే విధించాలన్న వాదనపై తీర్పును రిజర్వు చేసింది.

అంతకుముందు ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీతరలించాలనే సుప్రీం తీర్పును సమర్థించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని, బాధితుల సంఖ్య భారీగా ఉందన్నారు. మాంసాహారం తినేవారు కూడా జంతుప్రేమికులమని ప్రకటించుకుంటున్నారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఏటా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని నివేదించారు. రోజుకు దాదాపు 10వేల కుక్కకాటు కేసులు నమోదవుతున్నా యని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వందల సంఖ్యలో రేబిస్‌ మరణాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. జంతువులను ఎవరూ ద్వేషించరని… ఎంతో మంది చిన్నారులు వీటి దాడుల్లో ప్రాణాలు కోల్పోతుండటంతోనే వీధి కుక్కుల తరలింపు అనివార్యమవుతుందన్నారు. సంతాన నియంత్రణతో రేబిస్‌ను అరికట్టలేమని.. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వాదించారు.

అటు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆగస్టు 11న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. వీధి కుక్కలకు షెల్టర్లు లేనుందునా ఇప్పటికిప్పుడు వాటిని ఎక్కడికి తరలిస్తారు? మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాటిని నిర్మిస్తుందా? అనే ప్రశ్నలను లేవనెత్తారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుపై స్టే విధించాలన్న వాదనపై తీర్పును రిజర్వు చేసింది.

ఇవి కూడా చదవండి…

యూరియా కోసం రైతన్నల ఆందోళనల పర్వం!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్