cheetahs । అంతర్జాతీయ చీతా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి విడిచిపెట్టారు. తమ సఫారీ యాత్ర సందర్భంగా ఈ రెండు అద్భుతమైన జంతువులను టూరిజం జోన్లో చూసేందుకు సందర్శకులు అవకాశం కలుగుతుందని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘అంతర్జాతీయ చీతా దినోత్సవాన్ని పురస్కరించుకుని అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను విజయవంతంగా కునో నేషనల్ పార్క్ పారాండ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టడం జరిగింది. రెండు చీతాలు పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నాయి’ అని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
పారాండ్ ప్రాంతం అహేరా టూరిజం జోన్లోకి వస్తుంది కనుక సందర్శకులు తమ సఫారీ యాత్ర సందర్భంగా వాటిని చూడొచ్చని పేర్కొన్నారు. నేషనల్ పార్క్లోకి విడిచిపెట్టడానికి ముందు ఈ రెండు చీతాలను బోనుల్లో ఉంచి సంరక్షించారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్లో 12 కూనలు సహా 24 చీతాలు ఉన్నాయి. భారతదేశంలో చీతాలు తగిన ఆవాస ప్రాంతాలు లేకపోవడం, వేట తదితర కారణాలతో 70 ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. మళ్లీ వాటి ఉనికిని చాటాలనే ఉద్దేశంతో చీతా ప్రాజెక్టును చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా అగ్ని, వాయు అనే చీతాలను నేషనల్ పార్క్లోకి వదిలారు. నమీబియా నుంచి తెప్పించిన 8 చీతాలను 2022 సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేషనల్ పార్క్ ఎన్క్లోజర్లలోకి విడుదల చేశారు. వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. తదుపరి 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించి కునో పార్క్లో వదిలారు.