one nation one election  । జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ముందుగా రద్దయ్యే రాష్ట్ర అసెంబ్లీలు ఇవే..

2029లో జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చిన పక్షంలో దాదాపు 17 రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం కనీసం మూడేళ్లకు ముందే ముగియనున్నది.

one nation one election  । జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ముందుగా రద్దయ్యే రాష్ట్ర అసెంబ్లీలు ఇవే..

one nation one election  । తీవ్ర వివాదాస్పదమైన జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక అడుగు వేసింది. దీని అమలు తీరుపై ఎన్నో సందేహాలు ఉన్నా.. ఇదేదో చాలా సింపుల్‌ వ్యవహారంగా కేంద్రం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. వాస్తవానికి మంగళవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. ఈ పదవీకాలంలోనే జమిలి ఎన్నికలను అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్రం.. రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫారసులను ఆమోదించింది.

లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సిఫారసులు చేయాలంటూ గత మోదీ ప్రభుత్వం కోవింద్‌ కమిటీని కోరింది. ఈ నేపథ్యంలో చర్చలు నిర్వహించిన కమిటీ.. తన సిఫారసులను గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. తొలుత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒక విడుతలో ఎన్నికలు నిర్వహించడం, తదుపరి వంద రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలి సాధ్యపడుతుందని కోవింద్‌ కమిటీ పేర్కొన్నది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో పలు కీలక సవరణలు చేయాల్సి ఉంటుంది. తొలి విడుతలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణలు అవసరమైనప్పటికీ.. పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రాల ర్యాటిఫికేషన్‌ అవసరం ఉండదు. అయితే.. వంద రోజుల తర్వాత నిర్వహించే స్థానిక ఎన్నికలకు మాత్రం కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

బీజేపీకి లోక్‌సభలో సొంతంగా 240 సీట్లు ఉన్నాయి. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోలేని స్థితిలో టీడీపీ, జనతాదళ్‌ (యూ), లోక్‌ జనశక్తి పార్టీ (రాంవిలాస్‌) వంటి పార్టీల మద్దతు ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికలకు ఈ పక్షాలు మద్దతు ఇవ్వడంపై సందేహాలు ఉన్నాయి. కానీ.. బీజేపీ మాత్రం ఈ విషయంలో ఎన్డీయే పక్షాలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నాయని, ఈ సంస్కరణల ప్రక్రియకు తమకు తగినంత సంఖ్యాబలం ఉన్నదని చెబుతున్నది.

కేంద్రం భావిస్తున్నట్టు 2029 ఎన్నికల నాటికి జమిలి ప్రక్రియ అమల్లోకి రావాలంటే.. అందుకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితులను పార్లమెంటు సవరించిన తర్వాత అనేక రాష్ట్రాల అసెంబ్లీలు తమ కాలపరిమితికంటే ముందే 2029లో రద్దవుతాయి. వాటికి 2029 లోక్‌సభ ఎన్నికలతోపాటే పోలింగ్‌ నిర్వహిస్తారు.

జమిలి ఎన్నికలకు మార్గదర్శిక ప్రణాళికను ప్రతిపాదించిన కోవింద్‌ కమిటీ దీనికి ఎప్పుడు సిద్ధపడతారనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలిపెట్టింది. గత ఏడాది పది రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి మళ్లీ 2028 నాటికి ఎన్నికలకు వెళతాయి. అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాల పదవీకాలం సుమారుగా ఏడాదికి అటూ ఇటూగా ఉండొచ్చని తెలుస్తున్నది. వాటిలో హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ 2027లో నిర్వహించనున్నారు. అంటే.. ఆ రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు సుమారు రెండేళ్లు అధికారంలో ఉంటాయి. ఇక పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026లో నిర్వహించనున్నందున వాటి పదవీకాలం మూడేళ్లకు పరిమితమవుతుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానాకు మాత్రం జమిలితో ప్రభావితం కావని చెబుతున్నారు.

ఉదాహరణకు 2029 నుంచి జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చారనుకుంటే.. లోక్‌సభ లేదా రాష్ట్ర అసెంబ్లీలు ఐదేళ్ల పదవీకాలానికి ముందే రద్దయితే తాజాగా ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. మధ్యంతర ఎన్నికల్లో గెలిచే ప్రభుత్వానికి ఐదేళ్లూ పదవీకాలం ఉండదు. రద్దయిన ప్రభుత్వానికి మిగిలి ఉన్న పదవీకాలమే కొత్త ప్రభుత్వానికి వర్తిస్తుంది. అది ఏడాది కావచ్చు.. రెండేళ్లు కావచ్చు.. తదుపరి సార్వత్రిక జమిలి ఎన్నికల్లో మళ్లీ ఆ ప్రభుత్వం ప్రజా తీర్పు కోరాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాలు నెగ్గినా ఇదే పరిస్థితి ఉంటుంది. దాని వల్ల అకారణంగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండదనేది ప్రభుత్వ వర్గాల వాదన.

ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం రీత్యా కీలక బిల్లులు ఆమోదం పొందడంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. జమిలి ఎన్నికలను ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది అంతిమంగా అధ్యక్ష పాలనకు దారి తీసే అవకాశం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉన్నదని చెబుతున్నాయి.