Kaleshwaram Project : కాళేశ్వరం కమిషన్ .. కేసీఆర్ ను విచారించబోతున్నదా?
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ను విచారించబోతున్నదా? ఇప్పుడే ఇదే చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును పెంచడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి.

కమిషన్ గడువు పొడిగింపు
Kaleshwaram Project : రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయ్యింది. త్వరలోనే కమిషన్ నివేదిక బయటపెట్టబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.
అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ ను ఎందుకు విచారించలేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ ను నిందిస్తూ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువు పెంచిన నేపథ్యంలో కేసీఆర్ సహా నాటి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన పలువురు కీలక నేతలను విచారణకు పిలుస్తారా? అన్న చర్చ జరుగుతున్నది. కాళేశ్వరం కమిషన్ గడువును జులై నెలాఖరు వరకు పెంచుతున్నట్లు పేర్కొంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గతేడాది నుంచి విచారణ జరిపింది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై విచారించింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను ప్రశ్నించింది.