KCR అనుచరులు పగటి కలలు కంటున్నారు

ప్రభుత్వాన్ని కూలగొడతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది
రియల్ ఎస్టేట్ దందాతో వేల కోట్లు దోచుకున్నారు
విధాత ప్రత్యేక ప్రతినిధి: ప్రజలు ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నాయకులకు ఆ పార్టీ నాయకుడు కేటీఆర్ వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు. ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన రెవిన్యూ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి ఈ విషయమై స్పందించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన నాయకులు రియల్ ఎస్టేట్ దందాతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులతో సంతలో కొన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని పడగొడుదామని కెసిఆర్ అనుచరులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ ఆటలు తెలంగాణలో సాగమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన భూభారతి చట్టం వల్ల ఉపయోగాలు, గత ధరణి వల్ల జరిగిన నష్టాలను వివరించారు. సదస్సుకు ముందు ములుగు గట్టమ్మ ఆలయం నుంచి వెంకటాపురం మండల కేంద్రాన్ని వరకు మంత్రులకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ధరణి చట్టం చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించలేని దద్దమ్మలు.. భూభారతి గురించి మాట్లాడుతున్నారు. pic.twitter.com/L9IFiAqb2W
— Telangana Congress (@INCTelangana) April 18, 2025