Maoist Mallojula Venugopal | పార్టీకి గుడ్ బై..మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల సంచలన ప్రకటన

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (భూపతి, అభయ్) పార్టీని వీడుతున్నట్లు, సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

Maoist Mallojula Venugopal

విధాత: మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, సోనూ, అభయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ క్యాడర్‌కు లేఖ రాసినట్లుగా మీడియా వర్గాల కథనం. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన మల్లోజుల సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేసే విషయంలో మరోసారి పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయమని మల్లోజుల పునరుద్ఘాటించారు.

మల్లోజుల వేణుగోపాల్ దివంగత మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీకి తమ్ముడు. వేణుగోపాల్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందాడు. ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తారా లొంగిపోయారు. కిషన్ జీ భార్య మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాత కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే పోలీసులకు లొంగిపోయారు. అటు మరో కేంద్రకమిటీ సభ్యుడు త‌క్కెళ్ల‌పల్లి వాసుదేవరావు (ఆశన్న) కూడా లొంగుబాటు వైపు అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.