- అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్
- సర్కారు క్వార్టర్ లోనే నివసిస్తున్నా
Padi Kaushik Reddy | Seethakka
విధాత ప్రత్యేక ప్రతినిధి: తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు. నియోజకవర్గంలో నేను తిరిగినట్లు నువ్వు తిరగలేవు. ప్రజలకు ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందామంటూ అసెంబ్లీ వేదికగా శనివారం బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి లేవనెత్తిన అంశాలను మంత్రి సీతక్క ఖండించారు.
సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీతక్క తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్ లో తిరిగే వాల్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో తెలుస్తుందా? అంటూ ప్రశ్నించారు. రైతులతో సంబంధం లేకుండా హైదరాబాద్ లో తిరుగుతున్నట్లు ఉందంటూ సెటైర్ వేశారు. బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసింది మీరు.. వరి వేస్తే ఉరి అన్నది మీరు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు 1200 కోట్లు బోనస్ ఇచ్చిందనీ, ఇంకా ఎవరికన్నా రాకపోతే అవి కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని చెప్పారు. భూమి లేని వాల్లకే కూలీ భరోసా ఇస్తున్నాం.. కొంత భూమి ఉన్న కూలీలకు ఇవ్వాలనే అంశం పరిశీలనలో ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మా ఇంటికి రావాలని ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్ లోనే తాను నివసిస్తున్నానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.