• Telugu News
  • /News

Sigachi Horrific Explosion | సిగాచీ నిర్లక్ష్యమే దారుణానికి కారణం?

సిగాచి ఇండస్ట్రీస్ యాజమాన్యం "ఇది రియాక్టర్ పేలుడు కాదు, సాధారణ అగ్నిప్రమాదమే" అని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది పాత మోటార్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని పేర్కొంటూ తప్పు తమదేమీ కాదనే వాదనను ముందుకు తెచ్చారు. అయితే ఇది అసత్యమని కార్మిక సంఘాలు తిరస్కరిస్తున్నాయి.

Reported by: Jagan Mohan Talluri | వార్త‌లు | Jul 02, 2025, 10:12 pm IST
Read Time: 8 mins
Sigachi Horrific Explosion | సిగాచీ నిర్లక్ష్యమే దారుణానికి కారణం?

హైలైట్స్:

  • పాత మోటర్లు, యంత్రాలతోనే పనులు
  • కార్మికుల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన కంపెనీ
  • ఇది రియాక్టర్​ పేలుడు కాదు : సిగాచీ ఇండస్ట్రీస్​
  • వందేళ్లలో దేశంలో ఇటువంటి ఘోరం చూడలేదు : ఫార్మా అధికారి

Sigachi Horrific Explosion | సంగారెడ్డి, జూలై 3: పాశామైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో జూన్ 30న ఉదయం చోటుచేసుకున్న ఘోర రసాయన పేలుడు మరచిపోలేని విషాదానికి దారి తీసింది. సిగాచి ఫార్మా యూనిట్‌లో జరిగిన ఈ పేలుడు 40 మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకోగా, మరో 33 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమేంటో స్పష్టత లేని పరిస్థితుల్లో, యాజమాన్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యూనిట్‌లో గత కొన్ని నెలలుగా యంత్రాలు మెల్లగా పనిచేయడం, పాతబడ్డ మోటార్లు, లీకేజ్‌లాంటి సమస్యలపై కార్మికులు పలు మార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటిని నిర్వహించే తీరుపై మెకానికల్ విభాగం కూడా అసంతృప్తిగా ఉందన్న సమాచారముంది. అయితే, ఉత్పత్తి నిలిపివేయడం వ్యాపారానికి నష్టం అనుకున్న యాజమాన్యం అన్ని హెచ్చరికలనూ పక్కనబెట్టి ప్రొడక్షన్ కొనసాగించిందని కార్మికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో 21 ఏళ్ల సాయి యశ్వంత్ తన తండ్రి మరణానికి బాధ్యత వహించాల్సింది యాజమాన్యమేనంటూ ఫిర్యాదు చేసాడు. అతని తండ్రి జగన్ మోహన్‌ 20 ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నారు. పేలుడు రోజు ఉదయం ఆయన విధుల్లోనే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమాచారం మామ ద్వారా అందుకున్న యశ్వంత్ వెంటనే ఆసుపత్రికి పరుగెత్తాడు. అప్పటికే తన తండ్రి మృతదేహం మార్చురీకి తరలించబడిన దృశ్యం అతడి హృదయాన్ని కలచివేసింది.

ప్రమాద కాలక్రమం – ఘోరానికి దారితీసిన సమయాలు
⦁ ఉదయం 9.30 – ఫ్యాక్టరీలో కొంత పొగ, తర్వాత చిన్న స్థాయి అగ్ని లేపనం.
⦁ 10.00–10.45 – ఫైర్ అలారంలు పనిచేయకపోవడం, మంటలు విస్తరించడం.
⦁ 11.00 గంటలకి – పెద్ద రసాయన పేలుడు, బాయిలర్లు లేదా స్టోరేజ్ ట్యాంకులు పేలే శబ్దం.
⦁ 12.00 తరువాత – మృతదేహాల వెలికితీత, కాలిపోయిన శరీరాలు, పరిసర ప్రాంతాల్లో ఉక్కిరిబిక్కిరైన వాతావరణం.
భానూర్ పోలీసుల ధ్రువీకరణ – నేరంగా నమోదు
సాయి యశ్వంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా భానూర్ బీడీఎల్ పోలీసులు వెంటనే స్పందించారు. సిగాచి ఇండస్ట్రీస్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు:
⦁ సెక్షన్ 105 – హత్యగా పరిగణించబడని నేరపూరిత మరణకారకం
⦁ సెక్షన్ 110 – హత్యాయత్నం
⦁ సెక్షన్ 117 – తీవ్ర గాయాలకు కారణమైన నేరం
ఇది పరిశ్రమలపై పర్యవేక్షణ, భద్రతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వ వ్యవస్థలను మరింత అప్రమత్తం చేయాల్సిన ఘటనగా పరిగణించబడుతోంది.

కంపెనీ భజన: ఇది యంత్రాల సమస్య కాదు

ఈ నేపథ్యంలో సిగాచి ఇండస్ట్రీస్ యాజమాన్యం “ఇది రియాక్టర్ పేలుడు కాదు, సాధారణ అగ్నిప్రమాదమే” అని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది పాత మోటార్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని పేర్కొంటూ తప్పు తమదేమీ కాదనే వాదనను ముందుకు తెచ్చారు. అయితే ఇది అసత్యమని కార్మిక సంఘాలు తిరస్కరిస్తున్నాయి. యంత్రాల నిర్వహణ వందశాతం యాజమాన్య బాధ్యతేనని స్పష్టం చేశాయి. ఈ ప్రమాదం పరిశ్రమల లాభాల పేరాశకు, నిబంధనలు పాటించకపోతే ఎటువంటి ప్రాణాపాయం ఉంటుందో గుర్తు చేసిన ఉదాహరణ. పాత యంత్రాలతో పని చేయడం, సేఫ్టీ డ్రిల్లులు లేకపోవడం, ఫైర్ అలారాలు స్పందించకపోవడం అన్నీ యాజమాన్య బాధ్యతా రాహిత్యాన్ని నిరూపిస్తున్నాయి.

ప్రభుత్వ స్థాయిలో స్పందన

ప్రమాదం అనంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రహస్య పరిశీలన నివేదికలను ప్రభుత్వం కోరినట్లు సమాచారం. కాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ ఘటనపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా ఘటనాస్థలిని సందర్శించారు.

బూడిద, కన్నీరే మిగిలింది

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు తక్కువ జీతానికి పనిచేసే సాధారణ కార్మికులు. వారి కుటుంబాల జీవితాల్లో వెలితి పూడ్చలేనిది. “రోజూ ఓ బక్కెట్ రసాయనం కలపడానికే నా తండ్రి నిండు ప్రాణాన్ని కోల్పోయాడు,” అంటూ యశ్వంత్ కన్నీళ్లతో చెప్పిన మాటలు మీడియా ప్రతినిధుల గుండెల్ని పిండేశాయి. ఈ సంఘటన కేవలం ఒక పరిశ్రమను కాదు, వ్యవస్థను ప్రశ్నిస్తోంది. సిగాచీ లాంటి పరిశ్రమల నిర్వహణ, భద్రత ప్రమాణాలు, కార్మిక హక్కులపై మరింత స్పష్టత, నిఘా, కఠిన చర్యలు అవసరమని ప్రజా అభిప్రాయం సుదీర్ఘంగా వినిపిస్తోంది. న్యాయం ఆలస్యం అయినా జరిగేనా? బాధిత కుటుంబాలకు ఆసరా ఏదన్నదే ఇప్పుడు సమాజం ఎదురుచూస్తున్న ప్రశ్న.