Ayodhya: కనువిందుగా.. అయోధ్య బాలరాముడికి సూర్య తిలకం

  • By: sr    news    Apr 06, 2025 7:55 PM IST
Ayodhya: కనువిందుగా.. అయోధ్య బాలరాముడికి సూర్య తిలకం

Ayodhya:

విధాత: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నూతన రామమందిరం నిర్మాణం.. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత రెండో శ్రీరామనవమి కావడంతో వేడుకలకు భారీగా భక్తజనం తరలివచ్చారు. ముఖ్యంగా బాలరాముడికి సూర్య తిలకం ఘట్టాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు వచ్చారు. ఉదయం నుంచి బాలరాముడికి అభి షేకాలు, అలంకార ఘట్టాలు పూర్తయ్యాక మధ్యాహ్నం 12గంటలకు బాల రాముడికి సూర్య తిలకం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాల రాముడు సూర్య తిలకం చూసిన భక్తులు రామనామస్మరణతో పులకించారు.

అయోధ్య గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేందుకు మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూర్య తిలకం ఆవిష్కృతం చేసేందుకు గడియారం ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వాడారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్ద మరో పరికరం అమర్చారు. అది కాంతిని గ్రహించి అద్దాన్ని 365రోజులు స్వల్పంగా కదుపుతూ మళ్లీ శ్రీరామనవమి రోజునా బాలరాముడి నుదుటి మీద పడేలా ఏర్పాటు చేశారు.

ఇందుకోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభకార పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించి..అక్కడి నుంచి పైపులోనికి కాంతి ప్రసరించి బాలరాముడి నుదటిపై తిలకంలో పడేలా ఏర్పాటు చేశారు. బెంగుళూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలో సూర్య తిలకం వ్యవస్థను ఏర్పాటు చేశారు.