• Telugu News
  • /News

Unesco: భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు!

Reported by: sr | వార్త‌లు | Apr 18, 2025, 7:53 pm IST
Read Time: 3 mins
Unesco: భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు!

విధాత: భారతీయ సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలైన భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చడం.. మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’’ అని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పందిస్తూ ‘‘భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు.. యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి’’ అని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో వెల్లడించారు.

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధరంగంలో సోదరులు, గురువులు, బంధు జనులందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి యుద్దంపై విముఖత చూపిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, జ్ఞాన సముపార్జన అంశాలను శ్రీకృష్ణుడు బోధించాడు.