Bihar Assembly | తేజస్వీకి సీఎం నితీష్ స్ట్రాంగ్ కౌంటర్

Reported by: Tejaswini Nanna | రాజకీయాలు | Jul 23, 2025, 3:32 pm IST
Read Time: 3 mins
Bihar Assembly | తేజస్వీకి సీఎం నితీష్ స్ట్రాంగ్ కౌంటర్

Bihar Assembly | విధాత: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly) ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దంతో వాడివేడిగా సాగుతున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చర్చలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) మాట్లాడుతూ తాము ఎస్‌ఐఆర్‌కు(SIR) వ్యతిరేకం కాదంటునే ఆ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించారు. బయట నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడి ఓటర్లుగా మారారని తమకు ఫిర్యాదులు అందాయని ఈసీ చెబుతుందని..2003లో ఈ ప్రక్రియ చేపట్టారని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత 2003-2005 మధ్య చాలా ఎన్నికలు జరిగాయని.. అప్పుడే ఈ ప్రక్రియ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో గెలిచి నకిలీ ఓట్లతో నితీష్ కుమార్(Nitish Kumar) ముఖ్యమంత్రి అయ్యారా?. మనం నకిలీ ఓట్లతో గెలిచి ఇక్కడికి వచ్చామా?’ అని తేజస్వీ యాదవ్ నిలదీశారు.

తేజస్వీ(Tejashwi) ఆరోపణలో అసహనానికి గురైన సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పై ఆర్జేడీ ఎందుకు గగ్గోలు పెడుతుందంటూ మండిపడ్డారు. నీ వయసెంతా..మీ నాన్న, అమ్మలు సీఎంగా ఉన్నప్పుడు నీవు ఇక్కడ ఉన్నావా అంటూ ప్రశ్నించారు. అప్పుడు నీవు చిన్నపిల్లాడివి అని..మీ తల్లిదండ్రులు చెరో ఏడేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు నీకు తెలుసా? అప్పట్లో రాత్రయితే అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉండేదని విమర్శలు గుప్పించారు. అప్పుడు నేనూ మీతో ఉన్నానని..కానీ, మీ పద్ధతి సరిగా లేదు కాబట్టే నేను బీజేపీతో చేతులు కలిపానన్నారు. ఇప్పుడు మేం బీజేపీ, జేడీయూలుగా కలిసే ఉన్నామన్నారు. అలాగే ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని..ఏం చేయాలో ప్రజలకు తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు.