PM Modi’s Car | ప్రధాని మోదీ రేంజ్ రోవర్ సెంటినెల్: భారతదేశంలో అత్యంత సురక్షిత కారు ఇదేనా?
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న రేంజ్ రోవర్ కారు వార్తల్లో నిలిచింది. ఈ మోడల్, దాని ప్రత్యేకతలు, భద్రతా ప్రమాణాలు, సౌలభ్యాలు, ఇంకా ప్రధాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అదనపు భద్రతావ్యవస్థలు ఈ కారును ఇతర వాహనాలనుండి వేరు చేస్తాయి. వివరాలు చూద్దామా!
PM Modi’s Armoured Range Rover: Built to Survive Bullets, Blasts and Attacks
PM Modi’s Car | 2026 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కర్తవ్య పథ్కు రేంజ్ రోవర్ కారులో చేరుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. ప్రపంచ స్థాయి నేతలు వినియోగించే ఈ వాహనం అత్యున్నత భద్రత, శక్తివంతమైన ఇంజిన్, ప్రత్యేక రక్షణ ఏర్పాట్లతో గుర్తింపు పొందింది. ఇది రేంజ్రోవర్ సెంటినెల్ మాడల్ ఎస్యూవీ.
సాధారణ మోడల్ నుంచి ప్రధాని ప్రత్యేక వెర్షన్ వరకు

రేంజ్ రోవర్ సెంటినెల్ను ల్యాండ్ రోవర్ సంస్థ ప్రత్యేకంగా ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారుల కోసం రూపొందించింది. ఇది ఫ్యాక్టరీ నుంచే బుల్లెట్ప్రూఫ్ తదితర రక్షణ ఏర్పాట్లతో విడుదలయ్యే కారు. ఈ వాహనానికి VR8 బాలిస్టిక్ సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే 7.62 మిల్లీమీటర్ల శక్తివంతమైన బుల్లెట్లను తట్టుకునే సామర్థ్యం ఇందులో ఉంది. అలాగే 15 కిలోల TNT పేలుడు స్థాయికి సమానమైన పేలుళ్లను కూడా నిరోధించగలదు.
అగ్నిమాపక వ్యవస్థ, స్వతంత్ర ఆక్సిజన్ సరఫరా, రన్-ఫ్లాట్ టైర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే సాధారణ సెంటినెల్ మోడల్కే ఈ స్థాయి భద్రత ఉంటుంది. అంటే ఈ మాడల్ను ఎవరైనా కొనుక్కోవచ్చు.

అయితే ప్రధాని మోదీ వినియోగించే వెర్షన్లో ప్రధాని భద్రతా అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక మార్పులు చేశారు. మల్టీ-లేయర్ ఆర్మర్ ప్లేట్లు, అండర్బాడీ మైన్ ప్రొటెక్షన్, జీవ, రసాయన ఆయుధ నిరోధక వ్యవస్థలు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ప్రధాని కార్యాలయం, భద్రతా బృందాలతో నేరుగా అనుసంధానమయ్యే నెట్వర్క్ కూడా ఉంటుంది. ఇవన్నీ ప్రధాని రక్షణ వ్యవస్థ స్వయంగా ఎంపిక చేసి, పరీక్షించిన భద్రతా వ్యవస్థలు. ప్రత్యేకంగా, ఇందులో ముందు భాగంలో ప్రత్యేకంగా రూపొందించిన బుల్లెట్ప్రూఫ్ గాజు ఉంటుంది. పక్కలకు ఉండే కిటికీ గ్లాస్ 150 మిల్లీమీటర్ల వరకు మాత్రమే తెరుచుకునేలా రూపొందించారు. దీంతో కీలక పత్రాలను మార్పిడి చేసుకునే సమయంలో ప్రయాణికులు బయటకు కనిపించకుండా భద్రత కల్పిస్తుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో కీలకంగా పనిచేసే రన్-ఫ్లాట్ టైర్ సిస్టమ్ ఉంది. టైర్లు పంక్చర్ అయినా కూడా గంటకు సగటు 80 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్ల వరకు వాహనం ప్రయాణించగలదు. భారత వాతావరణానికి అనుగుణంగా సస్పెన్షన్, కూలింగ్ సిస్టమ్లను ప్రత్యేకంగా సరిచేసారు.
అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, ప్రపంచ నేతల వినియోగం

రేంజ్ రోవర్ సెంటినెల్ను ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ నేతలు వినియోగిస్తున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రులు, కాంబోడియా రాజు, క్యామరూన్ అధ్యక్షుడు, నైజీరియా గవర్నర్లు తదితరులు ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాన్ని వ్యక్తిగతంగా కొనుగోలు చేసే అవకాశమూ ఉంది. ల్యాండ్ రోవర్ స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ (Special Vehicle Operations)విభాగం ద్వారా ప్రత్యేక ఆర్డర్పై దీన్ని పొందవచ్చు.
కొనుగోలు చేసిన వెంటనే ఇది VR8 భద్రతా ప్రమాణాలతోనే వస్తుంది. బయట నుంచి అదనపు బుల్లెట్ప్రూఫ్ కిట్ అమర్చాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర సుమారు 4 లక్షల యూరోలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 4.5 కోట్ల రూపాయలకు చేరుతుంది. ప్రధాని వాడే వర్షన్ ఖరీదు 10 కోట్లకు పైగా ఉంటుందని రక్షణ నిపుణుల అంచనా.
🚘 ఇంజిన్ & పనితీరు
- ఇంజిన్: 5.0 లీటర్ సూపర్చార్జ్డ్ V8
- పవర్: 380 HP
- బరువు: 4.4 టన్నులు+
- 0–100 kmph: 10.4 సెకన్లు
- టాప్ స్పీడ్: 193 kmph
🛋️ లగ్జరీ & టెక్నాలజీ
- Touch Pro Duo
- డ్యూయల్ 10 ఇంచుల స్క్రీన్లు
- మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్
- నాయిస్ ఐసోలేషన్ క్యాబిన్
- బుల్లెట్ప్రూఫ్ గ్లాస్
బుల్లెట్లు, బ్లాస్ట్లు, అత్యవసర పరిస్థితులు… ఏవైనా సరే ఎదుర్కొనేలా రూపొందించిన రేంజ్ రోవర్ సెంటినెల్, భారత ప్రధానమంత్రి భద్రతకు ప్రత్యేక అంగరక్షకుడిలా నిలుస్తోంది. ఇది ఒక కారు కాదు… దేశ గౌరవాన్ని కాపాడే సాంకేతిక కవచం. అందుకే మోదీ ప్రయాణించే ఈ వాహనం… భద్రతా వ్యవస్థల బలానికి ప్రతీకగా నిలుస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram