Site icon vidhaatha

Ind vs SL| సూప‌ర్ ఓవ‌ర్‌లో సునాయాసంగా గెలిచిన ఇండియా.. థ్రి్ల్లింగ్ విక్టరీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Ind vs SL| భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ ముగిసింది. తొలి రెండు టీ20ల‌లో గెలిచి సిరీస్ ద‌క్కించుకున్న టీమిండియా మూడో టీ20 మ్యాచ్‌లోను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. చివరి మ్యాచ్ పల్లెకెలెలో జర‌గ‌గా, ఈ మ్యాచ్‌లో భారత్ సూప‌ర్ ఓవ‌ర్‌లో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో ముగించింది. ముందుగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన టీమిండియా 137 ప‌రుగులు మాత్రమే చేసింది. విజయం సాధించేందుకు శ్రీలంక ల‌క్ష్యం 138 పరుగులు కాగా, 20 ఓవర్లలో ఆ జ‌ట్టు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించ‌గా, తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి 2 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే ఫోర్ కొట్టి మ్యాచ్‌ని గెలిపించాడు.

అయితే సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను శ్రీలంక.. మిడాల‌ర్డ‌ర్ వైఫ‌ల్యంతో కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది. 5 వికెట్లను చేతిలో పెట్టుకొని 12 బంతుల్లో 9 పరుగులు చేయలేక చ‌తికిల‌ప‌డింది. టీమిండియా పార్ట్ టైమ్ స్పిన్నర్స్ రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ సంచలన బౌలింగ్‌తో భార‌త్‌కి అద్భుత విజ‌యం ద‌క్కింద‌నే చెప్పాలి. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్(41 బంతుల్లో 3 ఫోర్లతో 43), కుశాల్ పెరీరా(34 బంతుల్లో 5 ఫోర్లతో 46), పాతుమ్ నిస్సంక(27 బంతుల్లో 5 ఫోర్లతో 26) మరోసారి అద్భుతంగా రాణించిన మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రు పెద్ద‌గా ప‌ర్‌ఫార్మెన్స్ చేయ‌లేక‌పోయారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ రెండేసి వికెట్లు తీసారు.

భార‌త బ్యాటింగ్ చూస్తే.. శుభ్‌మన్ గిల్‌(37 బంతుల్లో 3 ఫోర్లతో 39)తో పాటు రియాన్ పరాగ్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 26), వాషింగ్టన్ సుందర్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) కీలక ఇన్నింగ్స్ ఆడ‌డంతో భార‌త్ ఆ స్కోరు అయిన సాధించ‌గ‌లిగింది. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(2/29) రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ(3/28) మూడు వికెట్లు పడగొట్టాడు. చామిందు విక్రమిసంఘే, అసితా ఫెర్నాండో, రమేష్ మెండీస్ తలో వికెట్ తీసారు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ను రింకూ సింగ్‌కు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు సూర్య. ఆచితూచి ఆడుతున్న కుశాల్ పెరీరాను రింకూ సింగ్ రిటర్న్ క్యాచ్‌గా ఔట్ చేయ‌డంతో పాటు అదే ఓవర్ చివరి బంతికి రమేశ్ మెండీస్(3)ను కూడా ఔట్ చేసాడు. ఆఖరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 6 పరుగులు అవ‌స‌రం అయిన స‌మ‌యంలో సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అయితే సూర్య త‌ను వేసిన తొలి బంతిని డాట్ చేసి ఆ తర్వాతి రెండు బంతుల్లో వరుసగా వికెట్లు తీసాడు . రనౌట్ చేసే అవకాశాలను భారత ఆటగాళ్లు చేజార్చ‌డంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లింది.

Exit mobile version