రికార్డు చెరిగిపోకుండా భారత్ దాయాది పాకిస్తాన్పై విజయభేరి మోగించింది. తక్కువ స్కోర్ల మ్యాచ్లో ఘనవిజయం సాధించింది.
టి20 ప్రపంచకప్(T20 World Cup)లో భాగంగా న్యూయార్క్లో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్(Pakistan)పై భారత్(India) 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఊహించినట్లే భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. న్యూయార్క్ పిచ్పై బంతి అనూహ్యంగా బౌన్సవుతందని ఇరుజట్లకు ముందే తెలుసు కాబట్టి, భారత్ ఆచితూచి ఆడటం మొదలుపెట్టింది. తొలి వికెట్గా విరాట్ కోహ్లీ(4) వెనుదిరగగా, రిషభ్ పంత్ రోహిత్తో జత కలసి స్కోరును ముందుకు నడిపించాడు. వెనువెంటనే రోహిత్(13) కూడా అవుటవగా, ఆశ్యర్యకరంగా అక్షర్ పటేల్ బ్యాటింగ్ వచ్చాడు. రిషభ్, అక్షర్ కలిసి ఇన్నింగ్స్ను కాస్తా ముందుకు తోయగా, తరువాత వచ్చినవారెవరూ సరిగ్గా నిలబడలేకపోయారు. దాంతో 19 ఓవర్లలో భారత్ 119 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రౌఫ్ చెరో 3 వికెట్లు తీసుకోగా, ఆమిర్ 2, అఫ్రిది ఒక వికెట్ తీసుకున్నాడు.
120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్, ఆరంభంలో బాగానే ఆడింది. దాదాపు 15 ఓవర్ల వరకు పాకిస్తాన్దే పైచేయిగా కనబడింది. అప్పటికి 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 80 పరుగులు చేసింది. అప్పటినుండి మ్యాచ్ భారత్వేపు మళ్లింది. పరుగులేమీ రాకుండా వికెట్లు పడుతుండేసరికి ఒత్తిడికి లోనైన పాక్ బ్యాటర్లు మరింత ఇబ్బంది పడ్డారు. మరోవైపు పుంజుకున్న భారత్ బౌలర్లు పాక్ను వణికించేసరికి వారి వద్ద సమాధానం లేకుండా పోయింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసి ఓడిపోయింది.
భారత బౌలర్లలో బుమ్రా (Jasprit Bumrah) అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకోగా, హార్థిక్ పాండ్యా 2, అర్షదీప్, అక్షర్ చెరొకటి పంచుకున్నారు. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన భారత్ 4 పాయింట్లతో, 1.455 నెట్ రన్రేట్తో నిలబడింది. కాగా ఆడిన రెండు మ్యాచ్లలో ఓడిపోయి పాకిస్తాన్ సూపర్ 8 స్థానాన్ని సంక్లిష్టం చేసుకుంది.
నిజానికి టాస్ ఓడి, 119 పరుగులే చేసినప్పుడు సగటు భారత అభిమానులందరూ మ్యాచ్ పోయిందని నిర్ణయించేసుకున్నారు. కానీ, అనూహ్యంగా భారత బౌలర్లు చెలరేగిన విధానం అమాంతం అభిమానుల్లో ఆనందాన్ని తిరిగితెచ్చింది. 34 వేల సామర్థ్యమున్న న్యూయార్క్ స్టేడియం మొట్టమొదటిసారిగి కిటకిటలాడుతూ మొత్తం నిండిపోయి రికార్డు స్థాపించింది.