భారత్ బదులు తీర్చుకున్నది. పోయిన ప్రపంచకప్లో ఇంగ్లండ్ నుండి తీసుకున్న పరాభవాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. సగర్వంగా టి20 వరల్డ్కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నెల 29న దక్షిణాఫ్రికాతో ఆఖరిపోరులో తలపడనుంది.
టి20 ప్రపంచకప్ టోర్నీ(T20 World Cup 2024) సెమీ ఫైనల్(Semi-Final) పోటీలో భారత్ (India) ఇంగ్లండ్(England)పై చిరస్మరణీయమైన ఘనవిజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ప్రతిగా ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా భారత్ 68 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
వర్షం కారణంగా టాస్ ఆలస్యమైనా, ఆశ్యర్యకరంగా వరుణుడు ఆటకు ఆటంకం మాత్రం కలిగించలేదు. వాతావరణ శాఖ రోజంతా వానేనని హెచ్చరించినా, మంచి ఎండ కాసి మ్యాచ్ను కొనసాగనించింది. ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ ఎప్పటిలాగే కోహ్లీ(9) వికెట్ను త్వరగానే కోల్పోగా, కెప్టెన్ రోహిత్ శర్మ పట్టువదలని విక్రమార్కుడిలా రెచ్చిపోయాడు. పంత్(4) కూడా విఫలమయ్యాడు. అప్పడొచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి రోహిత్ ఆటను తిరిగి గాడిలో పెట్టాడు. రన్రేట్ను 8కి తగ్గకుండా చూసుకుంటూ వీరిద్దరూ ధాటిగా ఆడారు. మూడో వికెట్కు విలువైన 73 పరుగులు జోడించిన ఈ జంట, వెంటవెంటనే పెవిలియన్కు చేరుకుంది. రోహిత్ శర్మ Rohit Sharma 57 (6 ఫోర్లు, 2 సిక్స్లు) పరుగులు, సూర్య Surya Kumar yadav 47(4ఫోర్లు, 2 సిక్స్లు) చేసారు. తర్వాత హార్థిక్ పాండ్యా(13 బంతుల్లో 23) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో జడేజా(9 బంతుల్లో 17)), అక్షర్(6 బంతుల్లో 10) ధాటిగా ఆడి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచారు. ఆఖరికి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. India are 171/7 in 20 Overs.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా, టాప్లీ, ఆర్చర్, కరన్, అదిల్ తలా ఒకో వికెట్ తీసుకున్నారు.
గయానా ప్రొవిడెన్స్ పిచ్పై కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్, అక్షర్ పటేల్(Axar Patel) స్పిన్ ఉచ్చులో పడి విలవిలలాడింది. వేసిన ప్రతీ ఓవర్ మొదటి బంతికి వికెట్ తీసుకున్న అక్షర్, ఇంగ్లండ్ వెన్నులో వణుకు పుట్టించాడు. మొదటి నలుగురిలో ముగ్గురు ( బట్లర్(23), మొయిన్ ఆలీ(8), బెయిర్స్టో(0)) అక్షర్కు బలవ్వగా, ఒక్కడు(ఫిల్ సాల్ట్(5)) బుమ్రా ఖాతాలోకి వెళ్లాడు. ఇక అక్కన్నుంచి వికెట్లు తీసే బాధ్యతను కుల్దీప్(Kuldeep Yadav) తీసుకున్నాడు. పవర్ ప్లేలో 3 వికెట్లకు 39 పరుగులు చేసిన ఇంగ్లండ్, 10 ఓవర్లలో 5 వికెట్లకు 62 పరుగులకు చేరింది. హ్యారీ బ్రూక్(25), సామ్ కరన్(2), జోర్డాన్(1) కుల్దీప్ యాదవ్ స్పిన్ వలలో చిక్కుకుని పెవిలియన్కు చేరారు. 15 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు ఒక రనౌట్తో 8 వికెట్ల నష్టానికి 86 పరుగులు. మరో వికెట్(రషీద్)ను కూడా రనౌట్ రూపంలో చేజార్చుకున్న ఇంగ్లండ్ చివరికి 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయింది. England 103 All out.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో విజృంభించగా, బుమ్రా 2 వికెట్లు తీసాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు.
ఎల్లుండి బ్రిడ్జ్టౌన్లో జరిగే ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా(South Africa)తో తలపడటానికి భారత్ సిద్ధమయింది.