అన్ని మ్యాచ్లూ ఓడిపోయి పాయింట్లపట్టికలో అట్టడుగున ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు వరుసగా గెలుస్తూ మిగతా జట్ల ప్లేఆఫ్ ప్రయాణాన్ని అడ్డుకుంటోంది. ఇవాళ కూడా అదే పరిస్థితి. పది పాయింట్లకు చేరుకుని ప్లేఆఫ్ రేసులో నిలబడాలని గట్టిగా అనుకున్న గుజరాత్ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చల్లింది.
ఐపిఎల్–2024 లో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన 45వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ విధించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 16 ఓవర్లలో కేవలం ఒకే వికెట్ కోల్పోయి సాధించింది. విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 70 పరుగులు), విల్ జాక్స్(44 బంతుల్లో 100) వీరవిహారంతో బెంగళూరు ఏ సమయంలో కూడా సంయమనం కోల్పోకుండా, ఆడుతూపాడుతూ గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఎవరి స్థానాల్లో వారే ఉన్నా, పాయింట్లలో మాత్రం ఆర్సీబీ 6కు చేరింది. బెంగళూరు కోల్పోయిన ఒక వికెట్ కెప్టెన్ డ్యుప్లెసీని సాయి కిషోర్ అవుట్ చేసాడు.
అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి గుజరాత్ను బ్యాటింగ్కు దించింది. బెంగళూరు వ్యూహాలను పక్కాగా అమలు చేస్తూ, వృద్ధిమాన్ సాహా, స్కోరు 6 పరుగుల వద్ద ఉన్నప్పుడే అవుటయ్యాడు. తర్వాత కెప్టెన్ గిల్ కూడా ఎక్కువ సేపు నిలబడకుండా 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. మూడో స్థానంతో బ్యాటింగ్కు వచ్చిన సాయిసుదర్శన్ అద్భుతంగా ఆడి 84 పరుగులు చేసాడు. సాయితో జతకలిసిన షారుఖ్ఖాన్ కూడా 58 పరుగులు చేయడంతో జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సరిగ్గా 200 పరుగులు చేసింది.
బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మ్యాక్సీ, స్వప్నల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.