WPL 2026 – RCB vs GG | ఆర్‌సీబీ దూకుడు – 5వ మ్యాచ్​లోనూ విజయం

WPL 2026లో బెంగళూరు 178/6 భారీ స్కోరు చేసి, గుజరాత్‌ని 61 పరుగుల తేడాతో ఓడించింది. గౌతమీ నాయక్ 73, సయాలీ 3 వికెట్లు ఆర్‌సీబీ విజయానికి కారణం. గుజరాత్ 117 పరుగులకు 8 వికెట్లతో పరాజయం పాలైంది.

  • By: ADHARVA |    sports |    Published on : Jan 19, 2026 11:18 PM IST
WPL 2026 – RCB vs GG | ఆర్‌సీబీ దూకుడు – 5వ మ్యాచ్​లోనూ విజయం

WPL 2026: RCB Crush Gujarat Giants by 61 Runs; Gautami Naik’s 73 Powers Bengaluru to Fifth Straight Win

విధాత క్రీడా విభాగం | 19 జనవరి 2026 | హైదరాబాద్:

WPL 2026 – RCB vs GG | వడోదరలో శనివారం జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు తన ఆల్​రౌండ్​ ప్రతిభతో మరోసారి విజయాన్ని ముద్దాడింది. గుజరాజ్​ జెయింట్స్​తో జరిగిన ఈ మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్​ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేయగా, ప్రతిగా గుజరాత్​ ఛేదనలో తడబడి 8 వికెట్లకు 117 పరుగులే చేసి ఓటమిపాలైంది. దీంతో ఆర్​సీబీ  61 పరుగుల తేడాతో విజయం సాధించి, తన అప్రతిహత విజయపరంపరను కొనసాగిస్తూ, టేబుల్​ టాపర్​గా ఆడిన 5 మ్యాచ్​ల్లోనూ గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

పోటీ ఇవ్వకుండానే లొంగిపోయిన గుజరాత్​ జెయింట్స్​

179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​ ఆరంభించిన గుజరాత్​ జెయింట్స్​కు ఆదిలోనే దెబ్బ మీద దెబ్బలు తగిలాయి. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, 56 పరుగులకు 6 వికెట్లకు చేరింది. ఇక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన గుజరాత్​ చివరికి 18.3 ఓవర్లలో  120 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్​ ఆష్లే గార్డనర్​ ఒక్కతే అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా, ఇద్దరు మినహా మిగతావారెవరూ రెండంకెల స్కోరు కూడా అందుకోలేకపోయారు. బెంగళూరు బౌలర్ల ధాటికి గుజరాత్​ బ్యాటింగ్ ఆర్డర్​ కకావికలమైపోయింది. బెంగళూరు బౌలర్​ సయాలీ 3 వికెట్లు తీసుకోగా, మిగతావారందరూ తలో వికెట్​ పంచుకున్నారు.

బెంగళూరు రాయల్​ ఇన్నింగ్స్​తో భారీ స్కోరు

అంతకుముందు రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు బ్యాటింగ్​లో తమ శక్తిని మరోసారి చాటింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ అశ్లే గార్డ్నర్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆ నిర్ణయాన్ని బెంగళూరు బ్యాటర్లు పెద్ద స్కోరు చేసి సవాల్‌గా మార్చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌సీబీ 178/6 పరుగులు చేసి గుజరాత్ జట్టుకు భారీ లక్ష్యాన్ని ముందుంచింది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బెంగళూరు బ్యాటర్లు ఆత్మవిశ్వాసంగా ఆడారు. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా, తడబడకుండా నిలబడి రన్‌రేట్‌ను నిలకడగా కొనసాగించారు. కెప్టెన్ స్మృతీ మంధాన 26 పరుగులు చేయగా, గౌతమీ నాయక్​ బెంగళూరు ఇన్నింగ్స్​కు వెన్నెముకగా నిలబడి 73 పరుగులు చేసింది. రిచా ఘోష్​(27) తన దూకుడుతో వేగం పెంచగా, రాధా యాదవ్​ మరోసారి దడదడలాడించింది. ఆఖరి 2 బంతులు ఆడటానికి వచ్చిన చిన్నది శ్రేయాంక పాటిల్​ ఆ రెండింటికి ఫోర్లుగా బాది, అద్భుతమైన ఫినిషింగ్​ టచ్​ ఇచ్చింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి, కష్టసాధ్యమైన లక్ష్యాన్ని గుజరాత్​ ముందుంచింది. గుజరాత్ బౌలర్లకు విరామం లేకుండా బెంగళూరు బ్యాటర్లు ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. కెప్టెన్​ గార్డనర్​, కశ్వీ గౌతమ్​ చెరో 2 వికెట్లు తీసుకోగా, రేణుకాసింగ్​, సోఫీ డివైన్​ తలా ఒకటి తన ఖాతాలో వేసుకున్నారు.