ENG vs IND | రెండో టెస్ట్​లో ఇంగ్లండ్​పై భారత్​ చారిత్రాత్మక విజయం

ఎడ్జ్​బాస్టన్​: భారత, ఇంగ్లండ్​ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్​ల సిరీస్​లో ఇరుజట్లు చెరో మ్యాచ్​ గెలుచుకుని సమానంగా ఉన్నాయి.

ENG vs IND | రెండో టెస్ట్​లో ఇంగ్లండ్​పై భారత్​ చారిత్రాత్మక విజయం
  • రెండో టెస్ట్​లో యువభారత్​ ఘనవిజయం
  • 336 పరుగుల భారీ తేడా
  • ఎడ్జ్​బాస్టన్​లో భారత్​కిదే తొలి గెలుపు

భారత్​ ఎడ్జ్​బాస్టన్​(Edgebaston)లో ఇప్పటివరకు 8 మ్యాచులాడగా, ఏడింటిలో ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. ఇది తొమ్మిదో మ్యాచ్​. ఎట్టకేలకు 58 ఏళ్ల తర్వాత ఈ వేదికపై తొలివిజయాన్ని నమోదు చేసి భారత్​ యువరక్తం చరిత్ర సృష్టించింది. ఆకాశ్​దీప్(Akashdeep)​ 10 వికెట్ల ప్రదర్శన చేసి, ఇంగ్లండ్​లో ఈ అరుదైన ఫీట్​ చేసిన రెండో బౌలర్​గా చరిత్ర లిఖించాడు. అంతకుముందు చేతన్​శర్మ 1986లో బర్మింగ్​హమ్​లో పది వికెట్లు తీసుకున్నాడు.

అంతకుముందు టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ఇంగ్లండ్​కు అది ఎంత తెలివితక్కువ నిర్ణయమో తెలిసొచ్చింది. తొలి ఇన్నింగ్స్​లో భారత్​ యువ సారథి శుభ్​మన్​ గిల్(Shubman Gill)​ డబుల్​ సెంచరీలో చెలరేగగా, జడేజా, యశస్వి సహకారంతో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాదీ సిరాజ్(Siraj Ahmed)​ 6 వికెట్లతో రెచ్చిపోయాడు.  ప్రతిగా ఇంగ్లండ్​ తమ మొదటి ఇన్నింగ్స్​లో 407 పరుగులు చేసి భారత్​కు 180 పరుగుల ఆధిక్యతను అందించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్​ను కొనసాగించిన భారత్​ 6 వికెట్లకు 427 పరుగుల వద్ద డిక్లేర్​ చేసి  608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ఇంగ్లండ్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. ఆఖరి రోజైన నేడు ఇంగ్లండ్​ 271 పరుగులకు ఆలౌట్​ అయి, 336 పరుగల భారీ తేడాతో అపజయం పాలైంది. భారత బౌలర్​ ఆకాశ్​దీప్​ ఈసారి 6 వికెట్ల బాధ్యత తను తీసుకున్నాడు.