రాష్ట్రం‌లో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్రానికి మంత్రి దామోదర్ ‌రాజనర్సింహ విజ్ఞప్తి

తెలంగాణకు జాతీయ స్థాయి ఆయుర్వేద ఇనిస్టిట్యూట్‌ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి

రాష్ట్రంలో ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద
కేంద్రానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 11 (విధాత): తెలంగాణకు జాతీయ స్థాయి ఆయుర్వేద ఇనిస్టిట్యూట్‌ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. 2030 నాటికి దేశంలో 10 ఆల్‌ ఇండియా ఆయుర్వేద ఇనిస్టిట్యూట్స్‌ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆయుష్, ఆరోగ్యశాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌‌కి మంత్రి దామోదర్ రాజనర్సింహ లేఖ రాశారు.

తెలంగాణ అడవుల్లో అద్భుతమైన ఆయుర్వేద సంపద ఉన్నదని, మెడిసినల్ వాల్యూస్ ఉన్న మూలికలు, మొక్కల జాతులు ఉన్నాయని మంత్రి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవలే సుమారు 800 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించామని తెలిపారు. ఆయుష్ హాస్పిటళ్లను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా ఆయుష్ వైద్య విధానాలకు మంచి ప్రాచుర్యం ఉన్నదని, ఇక్కడి ప్రజలు ఆయుష్‌ వైద్య సేవలను కూడా వినియోగించుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేయబోయే ఆయుర్వేద ఇనిస్టిట్యూట్స్‌లో ఒకటి తెలంగాణకు కేటాయించాలని, అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు.

ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు శనివారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ని కలిసి లేఖను అందజేశారు.