BRS రజతోత్సవ సభకు 3వేల బస్సులు.. రూ.8కోట్లు చెల్లించిన నేత‌లు

Reported by: sr | తెలంగాణ‌ | Apr 07, 2025, 8:14 pm IST
Read Time: 3 mins
BRS రజతోత్సవ సభకు 3వేల బస్సులు.. రూ.8కోట్లు చెల్లించిన నేత‌లు

విధాత: BRS పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు 3000 బస్ లు కావాలని బీఆర్ఎస్ పార్టీ టీజీఎస్ ఆర్టీసీని కోరింది. ఇందుకు సంబంధించి బస్సులకు చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలను పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెక్కు రూపంలో ఆర్టీసీకి చెల్లించారు. ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కలిసిన మాజీ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు, కురువ విజయ్ కుమార్ లు లేఖను అందించారు.

అలాగే ఆర్టీసీ బస్సుల అద్దె కోసం రూ. 8 కోట్ల చెక్ ను ఎండీ సజ్జనర్ కు వారు అందచేశారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ రజతోత్సవ సభకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే స్వయంగా కేసీఆర్ ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీ ముఖ్య నేతలతో భేటీయై జన సమీకరణపై మార్గదర్శకం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఓటమి అనంతరం ఢిలా పడిన గులాబీ శ్రేణులకు వరంగల్ సభ ద్వారా జోష్ నింపి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కార్యోన్ముఖులను చేసి రాజకీయంగా పుంజుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.