విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు విచారణకు తన హాజరుకు సంబంధించి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న జూబ్లీహిల్స్ పోలీసులకు ప్రభాకర్రావు రాసిన లేఖలో పోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్ 26న తాను భారత్కు రావాల్సిందని.. ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు లేఖలో ప్రభాకర్రావు తెలిపారు.
నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని, నేను, నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఓ పోలీసు అధికారిగా ఎలాంటి తప్పు చేయలేదని, చట్టపరంగా విచారణ జరిపించాలని కోరుతున్నానని ప్రభాకర్రావు లేఖలో పేర్కోన్నారు. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, టెలీకాన్ఫరెన్స్, మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధమని, నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణాధికారికి చెబుతానని ప్రభాకర్ రావు లేఖలో చెప్పుకొచ్చారు. క్రమశిక్షణ గల అధికారినని.. విచారణ ఎదుర్కొంటానని. ఎక్కడికీ తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదని, పూర్తిగా కోలుకున్నాక మీ ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ప్రభాకర్వు లేఖలో విన్నవించుకున్నారు