Hyderabad | కామ కోరికలతో రగిలిపోయిన ఓ యువకుడు.. అభం శుభం తెలియని ఓ పదేండ్ల బాలుడి పట్ల క్రూరమృగంలా ప్రవర్తించాడు. టీవీ చూద్దాం.. చాక్లెట్ ఇప్పిస్తానని ఆశజూపి.. ఆ బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒకట్రెండు రోజులు అనుకుంటే పొరపాటే.. ఏకంగా నాలుగు నెలల పాటు బాలుడు ఆ యువకుడి చేతిలో నలిగిపోయాడు. ఈ కేసులో నిందితుడికి హైదరాబాద్ పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
కామాటిపుర పోలీసుల కథనం ప్రకారం.. పురానాపూల్ ప్రాంతానికి చెందిన అమన్ కుమార్(29) అలియాస్ అక్షయ్.. తన పక్కింటి బాలుడి(10)పై కన్నేశాడు. తన కామ వాంఛ తీర్చుకోవాలనే ఉద్దేశంతో.. ఆ బాలుడికి టీవీ చూద్దామని, చాక్లెట్ ఇప్పిస్తానని ఆశజూపాడు. ఇక బాలుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి.. బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. అలా 2023 ఆగస్టు నుంచి 4 నెలల పాటు ఆ బాలుడి పట్ల క్రూరమృగంలా ప్రవర్తించాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
బాలుడికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు అతన్ని విచారించడంతో విషయం బయటపడింది. బాలుడి తండ్రి 2023 డిసెంబరు 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి అర్చన.. నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.పదివేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
