దేశంలో మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా మరోసారి తేల్చిచెప్పారు. ఆదివారం అదిలాబాద్ పార్లమెంటు స్థానంలో కాగజ్నగర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం
నాల్గవ దశ నాటికి 250సీట్లు వస్తాయి
కాగజ్ నగర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
విధాత : దేశంలో మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా మరోసారి తేల్చిచెప్పారు. ఆదివారం అదిలాబాద్ పార్లమెంటు స్థానంలో కాగజ్నగర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు ప్రచారం చేస్తుందని, బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్ల రద్దు..రాజ్యాంగ మార్పు అంటూ కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తుందని, ఇందుకు తెలంగాణలో నాపై వచ్చిన ఫేక్ వీడియోనే నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఉగ్రవాద నిర్మూలనకు సర్జికల్ స్ట్రైక్ చేశామని తెలిపారు.
రామమందిరం నిర్మాణం పూర్తి చేయగా, కాంగ్రెస్ మందిర నిర్మాణంలో అడ్డుపడిందని, రాహుల్గాంధీ తన ఓటు బ్యాంకు పోతుందని రామమందిరం ప్రారంభోత్సవానికి రాలేదని ఆరోపించారు. రాహుల్గాంధీ ఓటు బ్యాంకు ఓవైసీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. మీ ముందు పార్లమెంటు ఎన్నికల్లో ఓ వైపు మోదీ.. మరోవైపు రాహుల్ ఉన్నారని, ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పని చేస్తున్నారని, కాని సెలవులు వచ్చాయంటే రాహుల్ గాంధీ బ్యాంకాక్లో ఎంజాయ్ చేస్తారని విమర్శించారు. ప్రజా సేవ చేసే ప్రధాని మోదీ కావాలా.. ఎంజాయ్ చేసే రాహుల్ బాబా కావాలా అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ 10సీట్లు గెలుస్తుంది
తెలంగాణలో బీజేపీ 10సీట్లు గెలుస్తుందని, దేశంలో మోదీ ఇప్పటికే రెండు దశలో పోలింగ్లో 100సీట్లతో సెంచరీ కొట్టారని,మూడో దశ పోలింగ్లో 200సీట్లు దాటుతాయని, నాల్గవ దశ తెలంగాణ పోలింగ్తో 250సీట్లు సాధించబోతున్నామని అమిత్ షా తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. బీఆరెస్ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణకు ఏటీఎంలా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే కమిషన్ల ప్రభుత్వమన్నారు. తెలంగాణలో గతంలో బీఆరెస్ అవినీతి చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు.