ములుగు జిల్లా కొంగాల అటవీ ప్రాంతంలో పేలుడు ఈ సంఘటనలో ..ఒకరు మృతి
ములుగు జిల్లా వాజేడు మండలంకొంగాల అటవీ ప్రాంతంలో పేలుడు జరిగి ఒకరు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది

విధాత, వరంగల్ ప్రతినిధి:ములుగు జిల్లా వాజేడు మండలంకొంగాల అటవీ ప్రాంతంలో పేలుడు జరిగి ఒకరు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ దారుణం జరిగింది. పోలీసులను టార్గెట్ చేస్తూ కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు సోమవారం పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు.
జగన్నాధపురం గ్రామానికి చెందిన అయిదుగురు ఇల్లందుల ఏసు (55 ), ఇల్లందుల రమేష్, ఇల్లందుల ఫకీర్, ఇల్లెందుల పాల్గుణ, అరికిల్ల లక్ష్మయ్య కట్టెల కోసం కొంగాల అటవీ ప్రాంతానికి ఉదయం వెళ్లారు.గుట్ట పైకి వెళ్తున్న సమయంలో దారిలో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఇల్లెందుల ఏసు అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా నలుగురు సేఫ్గా ఉన్నారు. ఎలాంటి గాయాలు కాలేదు. ప్రెజర్ బాంబు పేలడంతో శబ్దానికి దూరంగా పరిగెత్తారు. కొంగాల గుట్టపై బాంబు పేలడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇది తెలుసుకున్న బంధువులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి విలిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు.