National Masters Games | మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో జనవరి 27 నుంచి 31 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన నేషనల్ మాస్టర్స్ గేమ్స్ 2026లో భద్రాచలం డివిజన్ చర్ల గ్రామవాసి టీఏపీఆర్పీఏ సభ్యుడు గాలి రామ్మోహనరావు ప్రతిభ చాటారు. ఆయన ఏకంగా మూడు స్వర్ణ పతకాలను సాధించడం గర్వకారణమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావు హర్షం ప్రకటించారు. పోటీల్లో భాగంగా జావెలిన్ త్రో, షాట్ పుట్ త్రో, ఐదు వేల మీటర్ల వాకింగ్ విభాగాల్లో ఆయన స్వర్ణ పతకాలు సాధించడం విశేషమని కొనియాడారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా.. రాష్ట్ర, అంతర్రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన అనేక క్రీడా పోటీల్లో ఆయన బంగారు, వెండి పతకాలను సాధించి.. పేరు ప్రఖ్యాతులు సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పోటీల్లో పాల్గొని భద్రాచలానికి వచ్చిన గాలి రామ్మోహనరావును ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో పలువురు సత్కరించారు. ఆయన బంగారు పతకాలు సాధించడంపై అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మరిన్ని విజయాలు సాధించి.. తెలంగాణ రాష్ట్రానికి, భద్రాచలం డివిజన్కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం టీఏపీఆర్పీఏ డివిజన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, కోశాధికారి డి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ఎస్ రాజబాబు, పంపన సత్యనారాయణ, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, ఐవీవీ సత్యనారాయణ, బి రాజు, కిషన్రావు, చలవది శ్రీనివాస్, వీ రాంబాబు, డి తిరుమలరావు, రామరాజు, చింతా రాధాకృష్ణ జగన్మోహనరావు, కన్నయ్యలాల్ టీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
read also
IFMIS | ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులకు బ్రేక్ వేస్తున్నది అదే
PRC delay Telangana | పీఆర్సీకోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు
