: హైదరాబాద్ పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పుల కలకలం రేగింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై పార్థీ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దుండగులను పట్టుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పుల కలకలం రేగింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై పార్థీ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దుండగులను పట్టుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆపై గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్య కేసుకు సంబంధించి పార్థీ గ్యాంగ్ను నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకునేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసాని గూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారి ప్రక్కన మినీ ట్రాన్స్పోర్టు వాహనం ఆపిన కొల్లూరి రాజవర్ధన్(35)ను దుండగులు హత్య చేసి పారిపోయారు. రూ.10 వేల కోసం దొంగలతో పోరాడిన రాజవర్ధన్ తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుడు కృష్ణాజిల్లా పామూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో పార్థీ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. వెంటనే దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. పెద్ద అంబర్ పేటలో పార్థీ గ్యాంగ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడకు చేరుకున్న నల్గొండ క్రైమ్ బ్యాంచ్ పోలీసులు.. చాకచక్యంగా గ్యాంగ్ను పట్టుకునేందుకు యత్నించింది. అయితే పోలీసులు వచ్చిన విషయాన్ని గుర్తించిన దుండగులు…వారిపై కత్తులతో దాడి చేసేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. గాల్లోకి కాల్పులు జరిపి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల మోత మోగడంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. దొంగలను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా విడిపోయిన సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు తమ ఆపరేషన్ సక్సెస్ చేసి నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పెట్రోల్ బంకులు, ఇల్లు, బ్యాంకులు దోచుకోవడంలో పార్థీ గ్యాంగ్ ఆరితేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆ గ్యాంగ్ పై పదుల సంఖ్యలు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. పోలీస్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్గా పార్థీ గ్యాంగ్ పేరుమోసింది.