Koonanneni Sambasivarao | దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష .. ఢిల్లీలో నిరసన నిర్వహించాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షత ప్రదర్శిస్తుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు .

విధాత, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షత ప్రదర్శిస్తుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు .ప్రజలు చెల్లించిన పన్నులనే మళ్లీ మనం ఖర్చు చేస్తున్నామన్న సంగతి ప్రభుత్వాలు గుర్తెరుగాలన్నారు. 2014 నుంచి దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలు విడిపోవాలి అనే డిమాండ్లు వచ్చేలా పరిస్థితి తయారైందన్నారు. ఈ పరిస్థితులు దేశానికి మంచిది కాదని హితవు పలికారు. బీజేపీకి దక్షిణ భారత్ లో సరిగా సీట్లు రావట్లేదని, ఆ కోపం వాళ్లలో ఉందన్నారు. ఇవాళ అధికారం కోసం బీజేపీకి ఏపీ అవసరం ఉంది కాబట్టే కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. బీజేపీ పాలకులు నయా పద్ధతుల్లో కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని తెలిపారు. బొగ్గు, నీళ్లు, ఖనిజం, కరెంట్ ఉన్నప్పటికీ బయ్యారం ఉక్కు పరిశ్రమను ఎందుకు చేపట్టడం లేదని కేంద్రాన్ని నిలదీశారు. గిరిజన యూనివర్సిటీని నామమాత్రంగా ప్రకటించారని నిధులు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలో నిరసన తెలుపాలన్నారు. కేంద్రం తాము నిధులు ఇచ్చాం.. ఇచ్చామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రాలు ఇవ్వకపోతే.. కేంద్రానికి నిధులు ఎక్కడవని ప్రశ్నించారు. కేంద్రం జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను యాచకులుగా మార్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రం అనేది మిథ్య.. అని గతంలోనే ఎన్టీఆర్ అందుకే అన్నారని గుర్తు చేశారు. దేశానికి నేడు రాజనీతిజ్ఞుల కొరత ఉందని కూనంనేని అభిప్రాయపడ్డారు.