విధాత ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ నియోజకవర్గ అధికార పార్టీ బీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి దంపతులు పార్టీ వీడనున్నారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను తట్టుకోలేని తాము పార్టీని వీడుతున్నట్లు ఆపార్టీ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. మున్సిపల్ చైర్మన్ బాటలో పలువురు సర్పంచ్ లు, కౌన్సిలర్లు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడానికి వాహనాలతో భారీ ర్యాలీగా తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా బోధన్ పోలీసులు ర్యాలీలో పాల్గొన్న వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అప్రమత్తమైన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు బయలుదేరారు. సాయంత్రం గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే షకీల్ ను ఓడిస్తామని రంజాన్ పండగ రోజు ఎంఐఎం కార్పొరేటర్లు శపథం చేసిన విషయం తెలిసిందే.