ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని, మళ్లీ ఇప్పుడు బీజేపీ మాటలు
విధాత బ్యూరో, కరీంనగర్: ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని, మళ్లీ ఇప్పుడు బీజేపీ మాటలు నమ్మి మరో సారి ప్రజలు మోసపోతే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి, ఢిల్లీలో బడే భాయ్ నరేంద్రమోదీ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గములోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో రోడ్ షో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ నదుల అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని, గోదావరి నీళ్లను కృష్ణ నది మీదుగా కావేరి నదిలో కలిపి తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణ లోని గోదావరి నీళ్లను ఎత్తుకుపోవడానికి అదేమన్నా నరేంద్రమోదీ సొమ్ము కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లకు ఒక్క సీఎం మారుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రద్దయ్యేది, ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేది తెలువదన్నారు.
వినోద్ను గెలిపిస్తే జోడెద్దుల్లా పనిచేస్తాం
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి
బీజేపీ దొంగ మాటలు, కాంగ్రెస్ గారడీ మాయలో పడి ప్రజలు మోసపోవద్దని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. కరీంనగర్ ఎంపీగా ప్రజలు వినోద్ కుమార్ ను ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపిస్తే జోడెద్దుల్లాగా పని చేస్తామన్నారు.