సీఎం రేవంత్రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై బీఆరెస్ వంద ప్రశ్నలతో ట్విట్టర్ వేదికగా విరుచుకపడింది
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై బీఆరెస్ వంద ప్రశ్నలతో ట్విట్టర్ వేదికగా విరుచుకపడింది. వంద రోజుల్లో వంద తప్పులు చేసిందని, పదేళ్ల బీఆరెస్ పాలన తర్వారా తెలంగాణలో మళ్లీ రైతులకు తిప్పలు మొదలయ్యాయని విమర్శించింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన అబద్ధాల హస్తం పార్టీ అని బీఆరెస్ తన ట్వీట్లో విమర్శించింది. పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్గా మార్చింది మీరు కాదా? అని నిలదీసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు ఇస్తారని, రైతుబంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నించింది. వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైందని, ప్రతి మహిళకు రూ.2500 హామీ మరిచిపోయారా అని నిలదీసింది. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000 కు ఎందుకు పెంచలేదని ప్రశ్నించింది.
దళితబంధు పథకాన్ని అర్థాంతకరంగా ఎందుకు నిలిపివేశారని, అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారని, ఒకే ఒక్క రోజు ప్రజాభవన్కు వెళ్లి.. ఆ తరువాత ఎందుకు ముఖం చాటేశారని బీఆరెస్ ప్రశ్నించింది. చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేశారని, మళ్లీ తెలంగాణను కరెంటు కోతలు, బోర్ల బావుల కేంద్రంగా మార్చారని, మిషన భగీరథ పథకాలను మూలపడేసి మళ్లీ ట్యాంకర్ల రాజ్యం తెస్తున్నారని నిలదీశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని, కౌలు రైతులకు 15వేలు, ఆటోడ్రైవర్లకు 12వేలు ఎప్పుడిస్తారని, కేసీఆర్ కిట్, గొర్రెల పథకం దళిత బంధు లబ్ధిదారులకు ఎప్పుడు నిధులు, గొర్రెలు అందిస్తారని ప్రశ్నించారు.