Site icon vidhaatha

KTR | తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

న్యూఢిల్లీ: ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు అని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌లే బుద్ది చెబుతార‌ని ఆయ‌న తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుంద‌న్నారు. త్వ‌ర‌లోనే సుప్రీంకోర్టులో కేసు దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఇవాళ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది.

ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించిన‌ ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు చెట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అన‌ర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.

ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version