• Telugu News
  • /Telangana

Chinta Paramesh | జియాల‌జీలో పీహెచ్‌డీ ప‌ట్టా సాధించిన పాల‌మూరు ప‌శువుల కాప‌రి..

Chinta Paramesh | ఉమ్మ‌డి పాల‌మూరు( Palamuru ) జిల్లాకు చెందిన ఓ యువ‌కుడు ప‌శువుల కాప‌రి(Cattle Herder ) నుంచి పీహెచ్‌డీ ప‌ట్టా( Doctorate Holder ) అందుకునే దాకా ఎదిగాడు. అది కూడా పేరొందిన ఉస్మానియా యూనివ‌ర్సిటీ( Osmania University ) నుంచి జియాల‌జీ( Geology )లో పీహెచ్‌డీ చేశాడు. ఇప్పుడు ప్రొఫెస‌ర్( Professor ) కావ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అత‌ను చెబుతున్నాడు.

Reported by: raj | తెలంగాణ‌ | Jul 04, 2025, 7:17 am IST
Read Time: 6 mins
Chinta Paramesh | జియాల‌జీలో పీహెచ్‌డీ ప‌ట్టా సాధించిన పాల‌మూరు ప‌శువుల కాప‌రి..

Chinta Paramesh | రెక్కాడితే కానీ డొక్కాడ‌ని నిరుపేద కుటుంబం వారిది. ఇంటిల్లిపాది ప‌ని చేస్తే త‌ప్ప బుక్కెడు బువ్వ దొర‌క‌దు. అలాంటి నిరుపేద కుటుంబంలో ప‌శువుల కాప‌రి( Cattle Herder )గా ప‌ని చేసిన ఓ యువ‌కుడు.. నేడు ఉస్మానియా యూనివ‌ర్సిటీ( Osmania University ) నుంచి పీహెచ్‌డీ( PhD ) ప‌ట్టా సాధించాడు. అయితే ఆ ఒక్క ప‌రిచ‌య‌మే ప‌శువుల కాప‌రి( Cattle Herder )ని డాక్ట‌రేట్( Doctorate Holder ) సాధించే దాకా తీసుకెళ్లింది.

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా( Nagarkurnool District ) అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొండ‌నాగుల గ్రామానికి( Kondanagula Village ) చెందిన చింతా ప‌ర‌మేశ్( Chinta Pramaesh )(35)ది నిరుపేద కుటుంబం. ఇక చిన్న వ‌య‌సులోనే ప‌ర‌మేశ్.. ఓ భూస్వామి ఇంట్లో గాసానికి కుదిరాడు. ప్ర‌తి రోజు ప‌శువుల‌ను మేపుతూ, ఇత‌ర కూలీ ప‌నుల‌ను చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ప‌ర‌మేశ్ చ‌దువుకు దూర‌మ‌య్యాడు.

మ‌లుపుత‌ప్పిన ద‌స‌రా పండుగ‌..

ఇక ఓ ద‌స‌రా పండుగ నాడు ప‌ర‌మేశ్ కొత్త యూనిఫామ్ ధ‌రించి స్థానికంగా ఉన్న ఆల‌యానికి వెళ్లాడు. అక్క‌డ ఎంవీ ఫౌండేష‌న్( MV Foundation ) కార్య‌క‌ర్త మౌలాలీ దృష్టిలో ప‌ర‌మేశ్ ప‌డ్డాడు. ఆయ‌న ప‌ర‌మేశ్‌ను చేర‌దీసి.. వివ‌రాలు అడిగి తెలుసుకున్నాడు. త‌న‌కు కూడా చ‌దువుకోవాల‌నే ఆస‌క్తి ఉంద‌ని ప‌ర‌మేశ్ మౌలాలీకి చెప్పాడు. దీంతో రాంపూర్‌లో ఉన్న ఎంవీ ఫౌండేష‌న్ ద్వారా బ్రిడ్జి కోర్సు చేయాల‌ని సూచించాడు.

ఆ ప‌రిచ‌యంతో.. త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి..

మౌలాలీ సూచ‌న‌ల మేర‌కు ప‌ర‌మేశ్ త‌న పేరెంట్స్‌ను ఒప్పించాడు. ఇక నేరుగా ఎంవీ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న బ్రిడ్జి కోర్సులో చేరి.. 14 ఏండ్ల వ‌య‌సులో ఏడో త‌ర‌గ‌తి బోర్డు ఎగ్జామ్స్ పాస‌య్యాడు. ఎస్సీ హాస్ట‌ల్‌( SC Hostel )లో ఉంటూ ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు బ‌ల్మూర్‌లోనే చ‌దువుకున్నాడు. ప‌దిలో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచాడు. ఇంట‌ర్ క‌ల్వ‌కుర్తి గురుకుల కాలేజీ( Residential College )లో పూర్తి చేశాడు. హైద‌రాబాద్‌లోని సైఫాబాద్ పీజీ కాలేజీ( Saifabad PG College )లో డిగ్రీ బీఎస్సీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ( Osmania University )లో ఎమ్మెస్సీ జియాల‌జీ( MSc Geology )లో 85 శాతం మార్కులతో ఉత్తీర్ణ‌త సాధించాడు.

ఆ త‌ర్వాత పీహెచ్‌డీ..

పీజీ పూర్త‌వ‌గానే.. రాజీవ్ గాంధీ నేష‌న‌ల్ ఫెలోషిప్ కింద పీహెచ్‌డీ సీటు సాధించాడు. అదే ఉస్మానియా యూనివ‌ర్సిటీలోని జియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో పీహెచ్‌డీ సీటు సాధించి.. త‌న రీసెర్చ్ ప్రారంభించాడు. ప్రొఫెస‌ర్ ముర‌ళీధ‌ర్ నేతృత్వంలో అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమ్రాబాద్, ప‌ద‌ర మండ‌ల ప‌రిధిలోని భూగ‌ర్భ జ‌లాల ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేసి థిసిస్ స‌మ‌ర్పించాడు. ఇటీవ‌లే ప‌ర‌మేశ్‌కు ఓయూ పీహెచ్‌డీ ప‌ట్టాను ప్ర‌క‌టించింది.

ప్రొఫెస‌ర్ కావ‌డ‌మే లక్ష్యం..

13 ఏండ్ల వ‌య‌సులో ప‌శువుల కాప‌రి జీవితాన్ని ప‌క్క‌న‌పెట్టి.. చ‌దువును కొన‌సాగించిన ప‌ర‌మేశ్ 35 ఏండ్ల వ‌య‌సులో పీహెచ్‌డీ ప‌ట్టాను అందుకున్నాడు. ప్ర‌స్తుతం జియాల‌జిస్ట్‌గా ఓ ప్ర‌యివేటు సంస్థ‌లో ప‌ర‌మేశ్ ప‌ని చేస్తున్నాడు. ప్రొఫెస‌ర్ కావ‌డ‌మే త‌న క‌ల అని ప‌ర‌మేశ్ పేర్కొన్నాడు.