రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతుండు... కొడంగల్ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా..పంద్రాగస్టులోగా రుణమాఫీ
– హరీష్ రావు కు రేవంత్ రెడ్డి సవాల్
– నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామ కేసీఆర్
ను అడుగు
– బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.
– కొడంగల్ ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నేతల కుట్ర
– నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్నది డీకే అరుణ
– నరేంద్రమోదీ చేతిలో అరుణ కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దు
– 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తా
– పదేళ్లు ప్రజలను మోసం చేసిన కెసిఆర్ చెంపలు వాయించాలి
– కొడంగల్ కార్యకర్తల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతుండు… కొడంగల్ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా..పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీ బీ ఆర్ ఎస్ ను రద్దు చేసుకుంటావా…ఈ సవాల్ కు హరీష్ సిద్ధమా..అని ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అన్నారు.మంగళవారం కొడంగల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న రేవంత్ రెడ్డి హరీష్ రావు, కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.పదేళ్లు ఫార్మ్ హౌస్ లో ఉంది ప్రజలు బాగోగులు తెలుసుకోకుండా
మోసం చేసిన కెసిఆర్ చెంపలు వాయించాలి… తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు..రూ. 3900 కోట్ల లోటు బడ్జెట్ తో నేను సీఎం గా బాధ్యత తీసుకున్నా.. కెసిఆర్ లాంటి సన్నాసి రాష్ట్రాన్ని దివాళ తీయిస్తే నేను వచ్చాక నాలుగు నెలలల్లో రూ 26వేల కోట్లు వడ్డీలు కట్టా..కెసిఆర్…అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా…అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు…ఇది ప్రజలు ఇచ్చిన పదవి.. కెసిఆర్ దిగిపొమ్మంటున్నారు.. ఈ మాటలు అంటున్న కెసిఆర్ కు దిమ్మ తిరిగే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలి. నాపై కక్ష కట్టి కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీ ఆర్ ఎస్ కుట్ర చేస్తున్నాయని సీఎం అన్నారు.ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కొడంగల్ ప్రజలపై ఉందని, కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుందన్నారు.
కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మదని కొనియాడారు. గతం లో చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్ కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారన్నారు. కొడంగల్ అభివృద్ధి ని ఓర్వలేక దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారన్నారు.ఇప్పటికీ నారాయణ పేట ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేoదుకు రూ.400 కోట్లు కేటాయించామని, ఇదే కాక మరిన్ని అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు కేటాయించామని సీఎం వెల్లడించారు. ఈ అభివృద్ధి ని ఓర్వలేక, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ప్రభావం తగ్గించేందుకు బీజేపీ, బీ ఆర్ ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు.
డీకే అరుణ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి :
ఆనాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రాష్ట్ర మంత్రి గా ఉన్న డీకే అరుణ నారాయణపేట ఎత్తిపోతల పథకం రాకుండా అడ్డుకున్నది నిజం కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిoచారు. అలాంటి అరుణ ఇవాళ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు. తనను రేవంత్ రెడ్డి అవమానించారని డీకే అరుణ మాట్లాడుతున్నారు.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే నేను ప్రశ్నించాన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని డీకే అరుణ కు సీఎం హితవు పలికారు.
అలాంటి నాకు మీ మీద అసూయ ఎందుకుంటుందని, ఎందుకు కోపం ఉంటుందన్నారు. నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు.. ప్రత్యర్ధులు లేరు…అని రేవంత్ రెడ్డి అన్నారు.bపాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంత అని,70 ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాకు అండగా నిలబడండి.. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. పార్టీలకు అతీతంగా ముందుకు రండి… పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 35 లక్షల మంది మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామన్నారు.పేదలకు
రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ… 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టు లోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడంటే తప్పకుండ నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉండన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి 50 వేల మెజారిటీ ఇవ్వండని ప్రజలను కోరారు.ఈ సమావేశం లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.