తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన పర్యటనలో సీఎం బిజీగా ఉన్నారు
– డబ్ల్యుఈఎఫ్ ప్రెసిడెంట్, ఇథియోపియా డిప్యూటీ పీఎంతో భేటీ
– పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న పర్యటన
విధాత: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన పర్యటనలో సీఎం బిజీగా ఉన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్, ఇథియోపియా డిప్యూటీ పీఎం మేకొనెన్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సీఈవోలతో సీఎం బృందం చర్చలు చేపట్టింది. పలు ఒప్పందాలపై సంతకాలు చేసింది.
బుధవారం వైద్య ఆరోగ్య రంగంలో ప్రజల ఆరోగ్య వివరాలు రూపొందించే అంశంపై చర్చ జరగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేలా సమాలోచనలు చేపట్టి, ఆమేరకు ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యూరోపియన్ కమిషన్ ఆరోగ్య ఆహార కమిషనర్, జెనీవా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ అధినేత, ఆక్సియోస్ చీఫ్ ఎడిటర్, రువాండ ఐటీ మంత్రి, మయో క్లినక్ సీఈవో, టకేడా ఫార్మా కంపెనీ సీఈవోలు ఈభేటీకి హాజరుకానున్నారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని చర్చల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం కోరనుంది.
మంగళవారం జరిగిన భేటీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం, నైపుణ్యం పెంచే అంశాలపై ముఖ్యమంత్రి ఆదేశ ప్రతినిధులతో చర్చించారు. వరుసగా రెండు రోజుల పాటు భారత దేశానికి చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యు, గోద్రేజ్, ఎయిర్ టెల్, బజాజ్, సీఐఐ, నాస్కం వ్యాపార ప్రతినిధులతో పాటు నోవర్తిస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక్, గూగుల్, ఉబెర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కలుసుకుని, పెట్టుబడులపై చర్చించనున్నారు.