సీఎం రేవంత్ కోసం ఔటర్ పై గంటకు పైగా ట్రాఫిక్ నిలిపివేత..జనం నిలదీత

సీఎం రేవంత్ రెడ్డి కోసం ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు పైగా ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల వాహనదారులు తీవ్ర అసహనం వెళ్ళగక్కారు. పోలీసులను నిలదీసి.. హారన్లను మోగిస్తూ నిరసన తెలిపారు.

సీఎం రేవంత్ కోసం ఔటర్ పై గంటకు పైగా ట్రాఫిక్ నిలిపివేత..జనం నిలదీత

విధాత,హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కోసం ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు పైగా ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల వాహనదారులు తీవ్ర అసహనం వెళ్ళగక్కారు. రేవంత్ రెడ్డి తరచూ ఔటర్ రింగ్ రోడ్ పైనుండి జన్వాడ, నార్సింగి , గచ్చిబౌలి లాంటి ప్రాంతాలలో శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నాడని, అతను వెళ్లే సమయంలో గంటలు గంటలు ట్రాఫిక్ ఆపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. అత్యవసర పనులలో బయటకు వెళ్లే వారి పరిస్థితి రోజు దయనీయంగా మారిందని మండిపడుతున్నారు.

ఆదివారం కూడా ఉదయం ఔటర్ రింగ్ రోడ్డుపై పుప్పాలగూడ టోల్ గేట్ వద్ద రేవంత్ రెడ్డి కోసం గంటకు పైగా ట్రాఫిక్ ఆపడంతో ఎండలు, ఉక్కపోతలతో రోడ్లపై వేచి ఉండటంతో ఇబ్బంది పడిన వాహనదారులు పోలీసులను నిలదీశారు. పోలీసులు అంతే స్థాయిలో వాహనదారులపై మండిపడుతూ..తమను నిలదీసిన వాహనదారులపై కేసులు వేసి లోపల వేస్తామని బెదిరించారు.  పోలీసులు బెదిరించడంతో వాహనదారులు హారన్లు మోగిస్తూ..తమ నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు నిత్యం పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్తుంటే పోలీసులు వాహనాలను గంటలు గంటలు ఆపుతూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. సీఎం అయిన కొత్తలో నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపవద్దని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.