నిర్లక్ష్యం చేస్తే వేటే.. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించం
హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తేఎంతటి వారికైనా వేటు తప్పదని హెచ్చరించారు. అయితే నిబ్బద్దతతో పనిచేసే వారిని ప్రోత్సహించి, ఉన్నత స్థానం కల్పిస్తామని అన్నారు. శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

365 రోజులు పని చేసేలా విపత్తు నిర్వహణ వ్యవస్థ
ఔటర్ లోపల ఒక యూనిట్
జూన్ 4 వరకు పూర్తి ప్రణాళికను సిద్దం చేయండి
ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారికి బాధ్యతలు
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
విధాతః హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తేఎంతటి వారికైనా వేటు తప్పదని హెచ్చరించారు. అయితే నిబ్బద్దతతో పనిచేసే వారిని ప్రోత్సహించి, ఉన్నత స్థానం కల్పిస్తామని అన్నారు. శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవస్థ కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా రూపొందించాలని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జూన్ 4 లోగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వహించ కూడదని, వెంటనే పూడిక తీయాలన్నారు.
పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకోడ్ ముగిసిన తరువాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని అధికారులకు చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వాటికి బారీకేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టండని ఆదేశించారు.
గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమస్యాత్మక నాలాల వద్ద అవసరమైతే ప్రతి రోజు క్లీనింగ్ చేపట్టాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోమన్నారు.