ఎకో టూరిజంపై దృష్టి సారించాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సింగ‌పూర్ వంటి దేశాల్లో 30 ఎక‌రాల్లోనే నైట్ స‌ఫారీలు ఉన్నాయ‌ని, మ‌నకు భారీ విస్తీర్ణాల్లో అట‌వీ ప్రాంతాలు, అందులోనే న‌దులు, జ‌ల‌పాతాలు ఉన్నందున ఆ వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసే ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సూచించారు

  • By: Subbu |    telangana |    Published on : Aug 12, 2025 8:13 PM IST
ఎకో టూరిజంపై దృష్టి సారించాలి: సీఎం రేవంత్ రెడ్డి
  • అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు సందర్శకుల సంఖ్య పెంచాలి
  • అట‌వీ శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌తిపాద‌న‌లను సిద్ధం చేయాలి

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సింగ‌పూర్ వంటి దేశాల్లో 30 ఎక‌రాల్లోనే నైట్ స‌ఫారీలు ఉన్నాయ‌ని, మ‌నకు భారీ విస్తీర్ణాల్లో అట‌వీ ప్రాంతాలు, అందులోనే న‌దులు, జ‌ల‌పాతాలు ఉన్నందున ఆ వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసే ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సూచించారు. మంగళవారం అట‌వీ శాఖ‌పై క‌మాండ్ కంట్రోల్‌ సెంట‌ర్‌‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. అమ్రాబాద్‌, క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టులున్నా తెలంగాణ వాసులు ఇత‌ర రాష్ట్రాల్లోని బందీపూర్‌, త‌డోబా వంటి ప్రాంతాల‌కు పులుల సంద‌ర్శ‌న‌కు వెళుతున్నారని సీఎం అన్నారు.

అమ్రాబాద్, క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టుల‌కు సంద‌ర్శ‌కుల సంఖ్య పెంచేలా సౌక‌ర్యాలు క‌ల్పించాలని అధికారులకు సూచించారు. అట‌వీ, రెవెన్యూ శాఖ‌ల మ‌ధ్య భూ వివాదాల ప‌రిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సంయుక్త స‌ర్వే చేప‌ట్టాలన్నారు. వ‌రంగ‌ల్ కాక‌తీయ జూ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు రూపొందించాలన్నారు. హైద‌రాబాద్ త‌ర్వాత రాష్ట్రంలో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌లో జూ ను ప్ర‌భుత్వ‌-ప్రైవేటు భాగ‌స్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేయాలన్నారు. అట‌వీ జంతువుల దాడిలో మృతిచెందిన లేదా గాయ‌ప‌డిన వారికి, ప‌శువులు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాలని ఆదేశించారు.

అందుకు సీఎంఆర్ఎఫ్ నుంచి అవ‌స‌ర‌మైన మేర‌కు నిధులు వినియోగించుకోవాలన్నారు. కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి అనుమ‌తులను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా సాధించాలన్నారు. అడ‌వుల్లో వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ‌, వాటి క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాల‌న్నింటిని క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ కు అనుసంధానించాలన్నారు. అట‌వీ శాఖ‌లో అధికారుల కొర‌త‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి త‌గిన సంఖ్య‌లో ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో సంప్ర‌దించాలని అధికారులను ఆదేశించారు. అట‌వీ శాఖ‌లో ప్ర‌మోష‌న్లు, ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను త‌క్ష‌ణ‌మే సిద్ధం చేయాలన్నారు. శాఖ‌లో ఉత్త‌మ ప‌ని తీరు క‌న‌బ‌రిచే వారికి అవార్డుల‌ను ఇచ్చే ప్ర‌క్రియ‌ను పున‌రుద్ధ‌రించాలని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.