Loksabha Elections 2024 | పక్కాగా 13.. కాంగ్రెస్ ధీమా

రాష్ట్రంలో పక్కాగా 13 లోక్ సభ స్థానాలను గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తమ ప్రజాపాలనను ఓటర్లు ఆశీర్వదించారన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు.

  • Publish Date - May 14, 2024 / 05:26 PM IST

అసెంబ్లీ ఎన్నికల కంటే 5 శాతం ఓట్ బ్యాంక్ పెరిగిందని అంచనా
సానుకూల ఓటింగ్
తన నివాసంలో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

విధాతః రాష్ట్రంలో పక్కాగా 13 లోక్ సభ స్థానాలను గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తమ ప్రజాపాలనను ఓటర్లు ఆశీర్వదించారన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో మాట్లాడి పోలింగ్ జరిగిన తీరును సమీక్షించారు. అన్ని చోట్ల పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందన్న నిర్ణయానికి కాంగ్రెస్ నాయకులు వచ్చారు. పోలింగ్ అనుకూలంగా జరగం వల్ల రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలుచుకుంటామని నాయకులు అంచనా వేశారు.

సానుకూల ఓటింగ్

ఇప్పటి వరకు ఉన్న సర్వేల రిపోర్టులు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 సీట్లు పక్కాగా గెలుస్తామన్న నిర్ణయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చారు. అన్ని చోట్ల ఓటింగ్ కాంగ్రెస్ కు అనుకూలంగా జరిగిందని, వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గు చూపారని నేతలు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైందని అంచనాకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని ధీమాతో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.40 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే 4 నుంచి 5 శాతానికి మించి పార్టీ ఓటు బ్యాంకు తప్పకుండా పెరుగుతుందని విశ్లేషించుకున్నారు.

పోటీలో లేని బీఆరెస్

వివిధ సర్వేల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 13 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పక్కాగా గెలిచే అవకాశాలున్నాయని అంచనాకు వచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో ఫలితాలు అంచనా వేసేలా లేవని అభిప్రాయానికి నాయకులు వచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానానికి పోటీ పడిందని, బీఆరెస్ ఎక్కడ కూడా పోటీలో కనిపించలేదని తమకు అందిన సమాచారాన్ని నాయకులు విశ్లేషించుకున్నారు.

పక్కాగా గెలిచే స్థానాలు ఇవే

నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదనే అభిప్రాయానికి వచ్చారు.

 

Latest News