విధాత, : ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీల సమావేశం ముగిసింది. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, పార్టీ ప్రచార వ్యూహాలపై చర్చించారు. ఉదయం స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిపోగా, 100మందికి పైగా అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి అందించారు. అనంతరం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సహా ముఖ్య నేతలు, ఆయా కమిటీల సభ్యులు సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశం పిదప స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 60మంది కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలిపారు. మిగిలిన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి మొత్తం అభ్యర్థులందరిని ఒకేసారి ప్రకటించాలని పార్టీ కసరత్తు చేస్తుందన్నారు. బస్సు యాత్రకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని, ఈనెల 15వ తర్వాతా ఏ క్షణమైనా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. అలాగే కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు అంశంపై నేడు శనివారం ఆ పార్టీ నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపుతారన్నారు. చర్చల అనంతరం ఇదే రోజు స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించి పొత్తుల పై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కమ్యూనిస్టులతో పొత్తులను వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు.