విధాత : బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. రెండు రోజుల క్రితం కవిత అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన ధీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి జ్వరం తగ్గడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలో కవిత తరఫున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్సీ కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతించింది. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు చేయాలని అదేశాలు జారీ చేసింది. అలాగే.. వైద్య పరీక్షల అనంతరం ఆమె ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పాటుగా కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 16న అరెస్టు కాగా అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నారు.
KAVITHA | కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి .. కస్టడీ 22వరకు పొడిగింపు
