BV Raghavulu | అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి.. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు

గుడిసెలను తొలగించడం తీవ్ర అన్యాయం
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
విధాత, వరంగల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు పూనుకున్నందుకు సంతోషం వ్యక్తo చేస్తున్నామని, కానీ ప్రకటించిన విధివిధానాల్లో చాలా లోపాలు ఉన్నాయన్నారు. కౌలు రైతులను, రైతు మిత్ర బృందాలను విస్మరించారని, వారికి కూడా రుణమాఫీ అమలు చేయాలని అన్నారు.
రీ షెడ్యూల్ చేసిన రుణాలకి వర్తింపజేయాలని, కుంటి సాకులతో కొంతమందిని మినహాయించాలని చూడరాదన్నారు. పాసు పుస్తకాలు లేకపోయినా, పహానిలో పేరున్న రైతులకు కూడా రుణమాఫీని వర్తింప చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, ఏటునాగారం ఈ ప్రాంతాల్లో ఇలాంటి గిరిజన రైతులు ఎక్కువగా ఉన్నారన్నారు. జనగణన, కుల గణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ లకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని దానిలో వివాదం వుంది కాబట్టి కులగణన వెంటనే చేయాలన్నారు.
కోర్టు తీర్పు పేరుతో వరంగల్ మున్సిపల్ అధికారులు చెరువులను ఆక్రమించారని, పేదల గుడిసెలను వారంలో తొలగిస్తామని చెబుతున్నారని విమర్శించారు. హనుమకొండ బంధం చెరువులో ఎక్స్ సర్వీస్ మెన్, ప్రభుత్వ ఆఫీసులు, స్వాతంత్ర సమరయోధులు, కొంతమంది విలేకరులకు చెరువు శిఖములోనే పట్టాలిచ్చారని, కానీ పేదల ఇండ్లను కూల్చేస్తామన్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, ఎస్ వాసుదేవ రెడ్డి, జి ప్రభాకర్ రెడ్డి, రాగుల రమేష్, ఎం చుక్కయ్య, దొగ్గెల తిరుపతి, జి రాములు పాల్గొన్నారు.