హైదరాబాదీలారా నీటిని పొదుపుగా వాడుకోండి.. నీటిని వృధా చేయకండి. ఎందుకంటే జులై 4వ తేదీన(గురువారం) ఉదయం 7 గంటల నుంచి 24 గంటల పాటు నల్లా నీళ్ల సరఫరా నిలిపివేస్తున్నారు
హైదరాబాద్ : హైదరాబాదీలారా నీటిని పొదుపుగా వాడుకోండి.. నీటిని వృధా చేయకండి. ఎందుకంటే జులై 4వ తేదీన(గురువారం) ఉదయం 7 గంటల నుంచి 24 గంటల పాటు నల్లా నీళ్ల సరఫరా నిలిపివేస్తున్నారు. కాబట్టి నగర ప్రజలు నీటిని వృధా చేయకుండా, అవసరం మేరకు నీటిని వాడుకోవాలని జల మండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.
షేక్పేట, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, మూసాపేట్, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్పేట్, మణికొండ, నార్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్లో నల్లా నీళ్ల సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. భోజగుట్ట రిజర్వాయర్, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్ ఏరియాల్లో తక్కువ ప్రెజర్తో నీటి సరఫరా ఉంటుందని పేర్కొన్నారు.
నీటి సరఫరాకు అంతరాయం ఎందుకంటే..?
కంది సబ్ స్టేషన్, 132 కేవీ పెద్దాపూర్ వద్ద విద్యుత్ మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 7 నుంచి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టీజీ ట్రాన్స్కో ప్రకటించింది. ఈ విద్యుత్ లైన్ల ద్వారానే హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తున్న సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా అవుతోంది. కాబట్టి నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. విద్యుత్ మరమ్మతులు జులై 4 ఉదయం 7 నుంచి జులై 5 ఉదయం 7 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు.